కరోనా: కుక్కల్లా తరిమేశారు.. వాళ్లు అజ్ఞానులే కాదు డేంజర్ గాళ్లన్న కేటీఆర్
దేశంలోనే అతిపెద్ద కరోనా హాట్ స్పాట్ 'నిజాముద్దీన్ మర్కజ్' ద్వారా వేలమందికి వైరస్ సోకింది. తెలుగురాష్ట్రాల్లో ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 1085 మంది, తెలంగాణ నుంచి 1030 మంది ఢిల్లీకి వెళ్లొచ్చినట్లు తేలడంతో రెండురాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. గత రెండ్రోజుల వ్యవధిలోనే ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాలు అమాంతం పెరిగాయి. ఇదంతా ఒక ఎత్తైతే, పాజిటివ్ పేషెంట్లు కొందరు ట్రీట్మెంట్ కు నిరాకరిస్తుండటం, డాక్టర్లపై దాడులు చేస్తుండటం, ఆయా నివాసిత ప్రాంతాల్లో టెస్టులు చేసేందుకు వెళ్లిన వైద్య సిబ్బందిని దుర్భాషలాడటం ఇబ్బందికర పరిణామంగా మారింది.
నిజామాబాద్ సిటీ నుంచి ఢిల్లీ ప్రార్థనలకు 50 మంది వెళ్లొచ్చినట్లు గుర్తించిన అధికారులు.. పోలీసుల సాయంతో వాళ్లందరినీ అదుపులోకి తీసుకుని క్వారంటైన్ కు తరలించారు. అందులో ఒకరికి ఇప్పటికే పాజిటివ్ రాగా, మరికొందరి టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది. వాళ్ల కుటుంబీకులకు కూడా వైరస్ సోకి ఉంటుందేమోననే అనుమానంతో టెస్టులు చేసేందుకు వైద్య సిబ్బంది వెళ్లారు. కానీ జనం వాళ్లను అడ్డుకుని నానా మాటలు అనడంతో నర్సులు కన్నీటిపర్యంతమయ్యారు.
మాకూ కుటుంబాలున్నాయి..
‘‘ఆరోగ్యం ఎలా ఉందని అడిగినందుకు మమ్మల్ని బండబూతులు తిట్టారు. వీధిలో నుంచి కుక్కల్ని తరిమినట్లు తరిమేశారు. మాకు కూడా కుటుంబాలున్నాయి. రిస్క్ అయిన తెలిసినా, ఆపత్కాలంలో ప్రభుత్వ ఆదేశాలమేరకు మేం పనిచేస్తున్నాం. వైరస్ టెస్టులు చేయించుకోక పోతే జరిగే ప్రమాదాన్ని వివరించినా జనం వినిపించుకోవడం లేదు. కొట్టడానికి మీదిమీదికొచ్చారు''అని నిజామాబాద్ ఖిల్లా రోడ్డులో తన కెదురైన అనుభవాన్ని ఓ నర్సు మీడియాతో పంచుకున్నారు. దీనిపై స్థానిక ఎంపీ అర్వింద్ సైతం స్పందిస్తూ.. జోక్యం చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆ వీడియో తెలంగాణదేనంటూ..
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ చనిపోయిన వ్యక్తి కుటుంబీకులు డాక్టర్లపై దారుణంగా దాడికి పాల్పడటం, నిజామాబాద్ లో కరోనా కిట్లతో వెళ్లిన వైద్య సిబ్బందిని స్థానికులు తీవ్రంగా తిట్టి పంపడాన్ని తెలంగాణ సర్కారు సీరియస్ గా తీసుకుంది. వైద్య సిబ్బందిపై దాడుల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని మంత్రి ఈటల రాజేందర్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఈలోపే, మైనార్టీల సముదాయంలో కరోనా వైద్య సహాయక బృందంపై రాళ్ల దాడి జరిగిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అవి నిజామాబాద్ కు చెందినవేనని తొలుత ప్రచారం జరిగినా.. చివరికది ఇండోర్ ఘటన అని తెలియడంతో స్థానిక అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో పదుల కొద్దీ ఫిర్యాదులు వస్తుండటంతో దాడులపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
కేటీఆర్ వార్నింగ్
‘‘గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లపై దాడి, నిజామాబాద్ లో వైద్య సిబ్బంది అడ్డగింత, వాళ్లపై దూషణలు భరించలేనివిగా ఉననాయి. ఈ ఘటనల్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. నిజానికి కోరానా టెస్టులకు నిరాకరిస్తూ, డాక్టర్లకు సహకరించనివాళ్లంతా అజ్ఞానులే కాదు.. తోటివారికి, మొత్తం సమాజానికి ప్రమాదకారులు కూడా'' అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Recommended Video
ఎందుకిలా జరుగుతోంది?
కరోనా వైరస్ పై పెద్ద స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ.. వైద్య పరీక్షలకు కొందరు నిరాకరిస్తుండటం, ఏకంగా డాక్టర్లపైనే దాడులకు తెగబడుతుండటం, క్వారంటైన్ లో సామూహిక ప్రార్థనలు చేస్తుండటం అధికారులకు తలనొప్పిగా మారింది. కాగా, సదరు సిబ్బంది సీఏఏ, ఎన్సార్సీ వివరాలు సేకరించడానికి వచ్చారనే అనుమానంతోనే మైనార్టీలు వ్యతిరేకిస్తున్నట్లు కొన్ని రిపోర్టులొచ్చాయి. అదీగాక, క్వారంటైన్ అనేది ముస్లింలను విడదీసేందుకు జరిగే కుట్ర అని కొందరు మతపెద్దలు బోధిస్తున్న ఆడియో టేపులు బయటికిరావడం సంచలనంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే బలగాల మోహరింపు లేదా కర్ఫ్యూ విధించైనా ప్రజలకు హెల్త్ టెస్టులు చేసే అవకాశముంది.