coronavirus: తెలంగాణ సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు, కేసీఆర్ థ్యాంక్స్
హైదరాబాద్: కరోనా విపత్కర సమయంలో ప్రభుత్వాలకు తమవంతుగా సాయం అందిస్తున్నారు పారిశ్రామిక, సినీ, రాజకీయ ప్రముఖులు, తెలంగాణ సీఎం సహాయ నిధికి భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తాజా మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ అధినేత పీవీ కృష్ణారెడ్డ రూ. 5 కోట్ల చెక్కును సీఎం కేసీఆర్కు అందజేశారు.
భారీగా విరాళాలు
శాంతా బయోటెక్ సంస్థ అధినేత వరప్రసాద్ రెడ్డి రూ. కోటి చెక్కును సీఎం కేసీఆర్కు అందించారు. లారస్ ల్యాబ్స్ సంస్థ లక్ష హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను ఉచితంగా అందజేయడంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్కు ఆ సంస్థ సీఈఓ సత్యనారాయణ రూ. 50 లక్షలు విరాళంగా అందజేశారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్చన్స్ అధినేత నర్సింహారెడ్డి, మీనాక్షి గ్రూప్ ఛైర్మన్ కేఎస్ రావు రూ. కోటి, క్రెడాయ్ ప్రతినిధులు రూ. కోటి చెక్కులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు అందజేశారు.
సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు
కాగా, కరోనావైరస్ బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్యులు, సిబ్బందికి జీవీకే సంస్థ ప్రతినిధులు ఫణికుమార్, శైలజా రెడ్డి 4వేల ఎన్-95 మాస్కులను మంత్రి కేటీఆర్కు అందజేశారు. ఇటీవల సినీ హీరో నితిన్ తోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు కూడా భారీగా విరాళాలు అందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విరాళాలు అందించనవారికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
45కు చేరిన కరోనా కేసులు
ఇది ఇలావుండగా, తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 45కు చేరింది. గురువారం మధ్యాహ్నం వరకు 44 ఉండగా.. రాత్రి మరో కేసు నమోదైంది. సికింద్రాబాద్లోని బుద్ధానగర్ కు చెందిన 45ఏళ్ల ఓ వ్యక్తి కరోనా బారిన పడ్డారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడు దగ్గు, జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి కరోనా ఉందని తేల్చారు.
దేశంలో 21 మరణాలు..
ఇక దేశంలోనూ కరోనా వేగంగానే వ్యాపిస్తోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 700 దాటాయి. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 21కి చేరింది. గురువారం ఒక్క రోజే ఏకంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది.