హడలెత్తిస్తోన్న కరోనా.. 14 జిల్లాల్లో డబుల్ డిజిట్ కేసులు.. తెలంగాణలో ఇదీ పరిస్థితి..
దేశంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు ఎగబాకుతుండటం కలవరపెడుతోంది. తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజానికి క్రమంగా కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు,ప్రభుత్వం ఆశించినప్పటికీ.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఎప్పుడు ఎక్కడ కొత్త కేసు నమోదవుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వైరస్ కట్టడికి కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. అదే సమయంలో ప్రజల నుంచి మరింత సహకారం అవసరమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదివారం ప్రగతి భవన్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్,అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
యాక్టివ్ కేసులు 412...
'రాష్ట్రంలో ఆదివారం కూడా గణనీయ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో పరిస్థితి భయంకరంగా ఉంది. దేశవ్యాప్తంగానూ కేసులు, మరణాలు పెరిగాయి. కాబట్టే లాక్డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నాం. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలి. వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలి. ఇంతకుముందు కంటే మరింత జాగ్రత్త అవసరమని కేసీఆర్ సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య 531కి చేరగా.. మరణాల సంఖ్య 16కి పెరిగింది. ఇప్పటివరకు 103 మంది డిశ్చార్జి కాగా.. 412 యాక్టివ్ కేసులున్నాయి.
వాళ్లు ఇప్పటికైనా ముందుకు రావాలని విజ్ఞప్తి..
ఎవరైనా సరే ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కేసీఆర్ మరోసారి విజ్ఞప్తి చేశారు. కరోనా సోకిన వ్యక్తులున్న ప్రాంతాలను కంటైన్మెంట్ చేసి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ప్రజలు దీనికి సహకరించాలని.. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు పాటించినప్పుడే కరోనాను నివారించగలమని అన్నారు. అధికార యంత్రాంగం మరింత నిఘా పెంచాలని సూచించారు. ఎవరికి లక్షణాలు కనిపించినా పరీక్షలు నిర్వహించాలని, వారి కాంటాక్టులపైనా దృష్టి సారించాలని సూచించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మర్కజ్ వెళ్లి వచ్చినవారు.. ఇంకా ఎవరైనా వైద్య పరీక్షలు చేయించుకుంటే ఇప్పటికైనా స్వచ్చందంగా ముందుకు రావాలన్నారు. వారి కోసం,వారి కుటుంబం కోసం,సమాజ శ్రేయస్సు కోసం చెబుతున్నామన్నారు.
డబుల్ డిజిట్ కేసులు
రాష్ట్రంలో ఏప్రిల్ 30వ తేదీ వరకూ లాక్డౌన్ను పొడిగిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం జీవో.57 జారీ చేసింది. మొదట హైదరాబాద్లోనే ఎక్కువ కేసులు నమోదైనప్పటికీ... క్రమంగా జిల్లాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 14 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య డబుల్ డిజిట్కు చేరింది. ఆదివారం సాయంత్రం వరకూ నిజామాబాద్లో 50, రంగారెడ్డిలో 37, సూర్యాపేటలో 20, వికారాబాద్లో 21, మేడ్చల్లో 26, వరంగల్ అర్బన్లో 24 కేసులు నమోదయ్యాయి. వికారాబాద్లో రెండున్నరేళ్ల బాబుకు పాజిటివ్గా నిర్దారణ అయింది. ఇప్పటికే ఆ బాబు కుటుంబంలో ఒకరికి పాజిటివ్ రాగా... అతని ద్వారా బాబుకు సంక్రమించింది. ఇక ఇదే వికారాబాద్ జిల్లాలోని తాండూర్లో మరో పాజిటివ్ కేసు నమోదైంది.
నల్గొండ,కామారెడ్డి,మేడ్చల్,నిర్మల్...
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసుల సంఖ్య 37కి చేరింది. ఒక్క సూర్యాపేటలోనే 20 కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో కొత్తగా 2 పాజిటివ్ కేసులు నమోదవగా... జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 కేసులు నమోదయ్యాయి. ఇందులో 11 కేసులు బాన్సువాడలోనే నమోదవడం గమనార్హం. బాన్సువాడ నుంచి ఢిల్లీ మర్కజ్కు వెళ్లివచ్చినవారిలో ముగ్గురికి కరోనా సోకింది. వారితో కాంటాక్ట్ అయిన కుటుంబ సభ్యులు,ఇతరులకు వైరస్ సంక్రమించింది. మేడ్చల్ జిల్లాలో కొత్తగా మరో కేసు నమోదైంది. నిర్మల్ జిల్లాలో ఆదివారం భైంసాకు చెందిన ఇద్దరికి పాజిటివ్గా తేలింది. ఢిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా అతని భార్య,కుమారుడికి కూడా వైరస్ సోకింది. దీంతో జిల్లాలో మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదవగా.. మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారానే వ్యాధి సంక్రమించినట్టు గుర్తించారు.
భూపాలపల్లి,ఖమ్మం జిల్లాల్లో..
ఇక భూపాలజిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న సింగరేణి కార్మికుడి ద్వారా తాజాగా అతని భార్యకు పాజిటివ్గా నిర్దారణ అయింది. ఇంతకుముందు అతని కుమార్తెకు కూడా పాజిటివ్గా తేలింది. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కొత్తగా మరో కేసు నమోదైంది. జైనూరుకు చెందిన ఓ వ్యక్తికి రెండో విడత పరీక్షల్లో పాజిటివ్గా నిర్దారణ అయింది. ఖమ్మంలో 8 ఏళ్ల బాలికకు కరోనా పాజిటివ్గా తేలింది. ఖమ్మంలో ఏప్రిల్ 8న ఓ రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగికి పాజిటివ్గా తేలగా... శనివారం అతని కోడలికి,ఆదివారం ఆమె కూతురికి పాజిటివ్గా నిర్దారణ అయింది. అయితే వీరికి ఢిల్లీ మర్కజ్ గానీ,విదేశీ ట్రావెల్ హిస్టరీ గానీ లేకపోవడం గమనార్హం.రంగారెడ్డి జిల్లాలోని పహాడీ షరీఫ్కు చెందిన ఓ వ్యక్తికి ఆదివారం పాజిటివ్గా తేలింది.