ఏసిబికి చిక్కిన కూకట్పల్లి ఏసిపి: రెండ్రోజుల ముందే అవినీతిపై గొప్ప ప్రసంగం(వీడియో)
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించి ఏసిబికి ఇటీవల చిక్కిన కూకట్పల్లి ఏసిపి సంజీవరావు.. దానికి రెండ్రోజుల ముందే అవినీతిపై గొప్ప ప్రసంగాన్ని దంచేశాడు. అవినీతికి పాల్పడే వారు దేశానికి పట్టిన చీడపురుగుల్లాంటి వారని ఆ ప్రసంగంలో దుయ్యబట్టారు. ఓ వైపు అవినీతి, అక్రమాలతో భారీగా ఆస్తులు కూడబట్టుకుంటూనే.. ఇంత గొప్ప ప్రసంగం ఎలా ఇచ్చారబ్బ! అంటూ ఇప్పుడు ఆ ప్రసంగాన్ని విన్నవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
ఆయన ప్రసంగం వివరాలిలా ఉన్నాయి. 'ఐఏఎస్లు చేసి.. ఐపీఎస్లు చేసి.. ముఖ్యమంత్రులై.. అవినీతి కూపాల్లో చొచ్చుకుపోయి, కుంభకోణాల్లో ఇరుక్కుపోయి, చంచల్గూడ జైల్లో, చర్లపల్లి జైల్లో పడ్డారే... వాళ్ళంతా జాతికి ముద్దుబిడ్డలు కాదు... దుష్టశక్తులు' అని సంజీవరావు తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.
ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు కూకట్పల్లి ఏసీపీ సంజీవరావును గత శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు రూ.13 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు కూడా ఏసీబీ ప్రకటించింది. ఈ దాడులు జరగడానికి కొన్ని రోజుల ముందు కూకట్పల్లి పరిధిలోని ఓ కాలేజీలో ఫ్రెషర్స్డే జరిగింది.
Video Courtesy: ABN Telugu
ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన సంజీవరావు విద్యార్థుల్ని ఉద్దేశించి.. సుదీర్ఘ ప్రసంగం చేశారు. భరతమాతకు ముద్దుబిడ్డలుగా ఉండాలని.. ఉత్తచెత్త పౌరులుగా కాక.. ఉత్తమ పౌరులుగా నిలవాలని సంజీవరావు తన ప్రసంగంలో ఉద్బోధించారు.
ఈ సందర్భంగా కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు అంటూ శ్రీశ్రీ కవితనూ ఉదహరించారు. కాగా, ఏసీబీ దాడులు, ఆయన అరెస్టు నేపథ్యంలో సోమవారం ఈ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.