వారంరోజుల్లో ఆ రైతుల పంట పండుతుంది..శుభవార్త చెప్పిన మంత్రి!
తెలంగాణ రైతాంగానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో వారం రోజుల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. తెల్ల బంగారం సాగు చేసిన రైతులకు బంగారం లాంటి వార్త చెప్పారు.
పత్తి కొనుగోళ్ళపై మంత్రి తుమ్మల సమీక్ష
రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి కొనుగోళ్లపైన నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం తర్వాత ఈ శుభవార్త చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిన్నింగ్ మిల్లుల యజమానులు సిసిఐ టెండర్లలో పాల్గొనక పోవడం వల్ల తలెత్తిన సమస్యల పరిష్కారం పైన ప్రధానంగా చర్చ జరిపారు.

సిసిఐ సీఎండీ, కాటన్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో మరోమారు సమావేశం
ఏది ఏమైనా వచ్చే వారం రోజుల్లో రైతుల వద్ద నుండి పత్తి కొనుగోళ్లను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల సమస్యలు పరిష్కరించడం కోసం రేపు మరోమారు సిసిఐ సీఎండీ, కాటన్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా రైతులు ఆశించిన మేర పత్తి దిగుబడి లేదని, ఈ నేపథ్యంలో రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తా అన్న మంత్రి
రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో మిల్లర్లు టెండర్లు వేయడానికి ఎందుకు ముందుకు రాలేదో ఆ అభ్యంతరాలను వివరించిన మంత్రి, ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. లింట్ శాతం పైన, ఎల్ వన్ స్లాట్ బుకింగ్ ఏరియా మ్యాపింగ్ వంటి నిబంధనల పైన మిల్లర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్నారు.
పత్తి కొనుగోళ్లలో సీసీఐ కొత్త నిబంధనలు
ఈ వ్యవహారంలో గతంలో కూడా రెండు సార్లు సీసీఐ అధికారులు మిల్లర్ లతో సమావేశాలు నిర్వహించారు. అయితే గత సీజన్లో అనుసరించిన విధానాలను ఈ సంవత్సరం కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిసిఐ కి సూచన చేసింది. అయితే సిసిఐ అధికారులు ఈ ఏడాది కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలో ముఖ్యంగా లింట్ శాతం, మరికొన్ని నిబంధనలలో కొంత సడలింపు ఇస్తామని, మిగతా నిబంధనలు యధాతధంగా అమలు చేస్తామని మంత్రి తుమ్మలకు వివరించారు. వచ్చే వారం రోజుల్లో పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల రైతులకు భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications