కోవిడ్-19కి విటమిన్-డి విరుగుడులా పనిచేస్తుందా.. వైద్యులు ఏమంటున్నారు..?
కరోనా వైరస్కు వ్యాక్సిన్ను కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల సైంటిస్టులు ప్రయోగాల్లో తలమునకలై ఉన్నారు. అదే సమయంలో వైరస్ జన్యు క్రమంతో పాటు,ఎలాంటి శరీరాలపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందో తెలుసుకునేందుకు అనేక అధ్యయనాలు పరిశోధన దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలి ఓ అధ్యయనం విటమిన్-డి తక్కువగా ఉన్న వ్యక్తులు సులువుగా వైరస్ బారినపడుతారని పేర్కొంది. అయితే ఆ అధ్యయనం మరింత విస్తృత స్థాయిలో జరగాల్సి ఉందని పరిశోధకులు అంటున్నారు. మరోవైపు ప్రజల్లో విటమిన్-డి వాడకం పెరిగిపోయింది. దీనిపై వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
విటమిన్-డీ.. అదేమీ గ్యారెంటీ కాదు..
కేవలం విటమిన్-డి మాత్రలు వేసుకున్నంత మాత్రాన కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ బారినపడకుండా ఉంటామన్న గ్యారెంటీ లేదని హైదరాబాద్కి చెందిన వైద్యులు చెబుతున్నారు. 'విటమిన్-డి పెద్దగా ఖర్చుతో కూడుకున్నది కాదు,పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అయితే కిడ్నీ,కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మాత్రం వైద్యుల సూచన మేరకే వాటిని వాడాలి.' అని డా.మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీస్ సెంటర్ ఛైర్మన్,డయాబెటాలాజీ చీఫ్ డా.మోహన్ తెలిపారు.కరోనా చికిత్సలో విటమిన్-డి ఉపయోగంపై డా. జ్యోతి చబ్రియా మాట్లాడుతూ.. 'కోవిడ్ 19 అనేది కొత్త వైరస్. కాబట్టి సరైనా డేటా లేకుండా విటమిన్-డి మాత్రలను ట్రీట్మెంట్లో భాగంగా ఉపయోగించలేం.' అని చెప్పారు. విటమిన్-డి అనేది రోగ నిరోధక శక్తిని పెంచేదే అయినప్పటికీ.. సరైన క్లినికల్ స్టడీస్,డేటా లేకుండా కరోనా నివారణకు ఆ మాత్రలను వాడటం సరికాదన్నారు.
ఇటీవల పరిశోధనల్లో ఏం తేలిందంటే..
సాధారణంగా సూర్య కాంతి ద్వారా మనిషి శరీరానికి కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది. ఎముకలు,వెంట్రుకలు,కండరాల పెరుగుదలలో ఇది కీలకం వ్యవహరిస్తుంది. ఇటీవల బ్రిటన్ ఈస్ట్ యాంగ్లియా యూనివర్సిటీ పరిశోధకులు కోవిడ్-19 కేసులకు విటమిన్-డీ లోపానికి ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలో పరిశోధనలు జరిపారు. కరోనా సోకినవారిలో,కరోనాతో మృతి చెందినవారిలో ఎక్కువమంది విటమిన్-డి లోపంతో బాధపడుతున్నట్టు పరిశోధనల్లో తేల్చారు. అయితే ఇప్పుడే దీనిపై నిర్దారణకు రాలేమని.. విటమిన్ డీ లోపమే కరోనా సోకడానికి కారణమని భావించలేమని స్పష్టం చేశారు.
Recommended Video
వ్యాక్సిన్ వచ్చేవరకూ స్వీయ నియంత్రణే..
విటమిన్ డీ తక్కువగా ఉండే వృద్దులు,నలుపు చర్మం కలిగినవారు విటమిన్ డి మాత్రలను తీసుకోవడం మంచిదని.. తద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి కోవిడ్ 19ని తట్టుకోగలరని అదే పరిశోధనలో పేర్కొన్నారు. నలుపు రంగు చర్మం సూర్యకాంతిని తక్కువగా గ్రహిస్తుంది. కాబట్టి వారు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్టయితే ఆ సప్లిమెంట్ను తీసుకోవాలని పరిశోధనలో తెలిపారు.
అయితే పరిశోధన ఇంకా సమగ్ర స్థాయిలో జరగాల్సి ఉన్నందునా.. ఇప్పుడే ఈ ఫలితాలను విశ్వసించలేమన్న వాదన వినిపిస్తోంది. కోవిడ్ 19కి సరైన వ్యాక్సిన్ వచ్చేదాకా స్వీయ నియంత్రణ,వ్యక్తిగత పరిశుభ్రత,ఫేస్ మాస్కులు,ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.