మామూలు లేడీ కాదు: ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో కుచ్చుటోపీ, ఇదీ చిట్టా
విదేశాలకు బియ్యం, మాంసాన్ని ఎగుమతి చేసే వ్యాపారాన్ని ప్రారంభించినట్టు చాలామందిని నమ్మించింది.
హైదరాబాద్: ఫేక్ కంపెనీ పేరు చెప్పి అందులో పెట్టుబడుల పేరుతో భారీగా డబ్బులు గుంజిన ఓ మహిళను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి ఆమె ఏ కంపెనీ ప్రారంభించనప్పటికీ.. తనకున్న పరిచయాలతో భారీగా పెట్టుబడులు రాబట్టింది.
పెట్టుబడులు పెట్టినవాళ్లకు ఆమె చేసిన గత మోసాల గురించి తెలిసింది. కంపెనీ గురించి ఆరా తీస్తే మోసపోయామని గ్రహించారు. దీంతో పోలీసులను ఆశ్రయించడంతో.. సదరు మహిళను అరెస్టు చేశారు. అలా మరిన్ని వివరాలు బయటపడ్డాయి.
పోలీసుల కథనం ప్రకారం:
మహిళ మోసాల గురించి జాయింట్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలం యాప్రాల్ మైత్రీ ఎన్క్లేవ్లో నివసిస్తున్న తాటిపర్తి షీబా(50), వరంగల్ జిల్లాకు చెందిన బైక్ మెకానిక్ డానియల్ దంపతులు. షీబా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలను నిర్వహించే జోయల్ అనే వ్యక్తి వద్ద కీలక హోదాలో పనిచేసేది.
కన్సల్టెన్సీ పేరుతో:
జోయల్ వద్ద పనిచేస్తున్న సమయంలోనే విధుల్లో భాగంగా అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, మలేషియా, దుబాయ్ వంటి దేశాలను షీబా సందర్శించింది. ఆ సమయంలోనే కన్సల్టెన్సీ ఆలోచన బుర్రలో మెదిలింది. అలా 2006లో షీబా ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ కన్సల్టెన్సీని ప్రారంభించింది.
దుబాయ్లో ఉద్యోగాల పేరుతో:
షీబా కన్సల్టెన్సీ ద్వారా దుబాయ్ లో నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చాలామంది అమాయకుల నుంచి డబ్బులు గుంజింది. అలా చాలామంది మోసపోయారు. ఆ తర్వాత 2008లొ విదేశాల్లో ఉద్యోగం, వీసా ఇప్పిస్తానని చెప్పి మరికొంతమందిని మోసం చేసింది.
మరో మోసంతో:
వరుస మోసాలకు పాల్పడుతున్నా.. తననెవరూ ఏమి చేయడం లేదన్న ధైర్యంతో మరో మోసానికి పాల్పడింది షీబా. విదేశాలకు బియ్యం, మాంసాన్ని ఎగుమతి చేసే వ్యాపారాన్ని ప్రారంభించినట్టు చాలామందిని నమ్మించింది. ఇందులో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని చెప్పుకొచ్చింది. ఆమె మాటలు నమ్మి ఓ రిటైర్డ్ జైలర్ ఏకంగా రూ.45లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించడంతో ఆమె మోసాలన్ని వెలుగుచూశాయి.
లగ్జరీ లైఫ్:
అమాయకులను మోసం చేసి దండుకున్న డబ్బుతో షీబా విలాసవంతమైన జీవితం గడుపుతోందని, తనతో పాటు కుటుంబ సభ్యుల కోసం నాలుగైదు ఖరీదైన కార్లు, మూడు బైక్ లు కొనుగోలు చేసిందని పోలీసులు తెలిపారు. ఆ ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. మంగళవారం షీబా, డానియల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఏపీ, తెలంగాణల్లో షీబాపై ఆరు కేసులు నమోదైనట్టు వెల్లడించారు.