చంద్రబాబుపై కేసు నమోదు చేయండి: టీ కోర్టు ఆర్డర్
హైదరాబాద్: భారత దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగేలా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేయాలని కోర్టు పోలీసులను శనివారం నాడు ఆదేశించింది.
హైదరాబాదులో కూర్చొని పరిపాలన చేస్తే విదేశాల్లో ఉండి పాలిస్తున్నట్లుగా ఉందని ఆయన చెప్పడాన్ని తీవ్ర నేరంగా భావించాలని హైదరాబాదుకు చెందిన న్యాయవాది నర్సింహ సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం నాడు ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు వ్యాఖ్యలు జాతీయ సమైక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు. దానిని పరిశీలించిన మెజిస్ట్రేట్ మహ్మద్ యూసఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని హైదరాబాదులోని ఎల్బీ నగర్ పోలీసులను ఆదేశించారు.

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రోజుల క్రితం వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి పాలన సాగిస్తుంటే విదేశాల నుంచి పాలిస్తున్నట్లుందని చంద్రబాబు అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు.
దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిపై బుధవారం వివరణ ఇచ్చింది. ఆ మాటలను చంద్రబాబు అనలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎపి ఎన్జీవోలు కలిసినప్పుడు చంద్రబాబు ఆ మాటలు అన్నట్లు వార్తలు వచ్చాయి. చంద్రబాబు ఆ మాటలను అనలేదని, వసతులు లేకుండా కొత్త రాజధానికి ఉద్యోగులు వెళ్లడం ఇబ్బందికరమని ఉద్యోగులు అన్నప్పుడు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారని ఆ ప్రకటనలో ప్రభుత్వం వివరించింది.












Click it and Unblock the Notifications