తెలంగాణలో కరోనా: కొత్తగా 8126 కేసులు -ఒక్కరోజే 38 మంది బలి -ఎన్నికల జిల్లాల్లో వైరస్ విలయం -దొంగలెక్కలా?
తెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతి మరింత పెరిగింది. రోజువారీ కేసులు, మరణాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. యాక్టివ్ కేసులు గుట్టలాపెరిగిపోయి, రికవరీ రేటు కనిష్టస్థాయికి చేరింది. స్వయంగా ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి సైతం కొవిడ్ బారినపడినా మున్సిపల్ ఎన్నికల విషయంలో సర్కారు మొండి పట్టు వల్ల ఆయా జిల్లాల్లో కొత్త కేసులు అమాంతం పెరిగాయి. వివరాల్లోకి వెళితే..
ఒక్కరోజే 38 మంది బలి
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ లోని వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1,08,602 టెస్టులు చేయగా, కొత్తగా 8,126మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిన్న ఒక్కరోజే మహమ్మారి కాటుకు 38 మంది బలైపోయారు. కొత్త కేసులు, మరణాల సంఖ్యలో ఇదొక తాజా రికార్డు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,95,232కు, మొత్తం మరణాల సంఖ్య 1999కి పెరిగాయి. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.1శాతంకాగా, తెలంగాణలో అది 0.5శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.
సీఎంకు 40 మంది డాక్టర్ల ఘాటు లేఖ
కొవిడ్ వ్యాధి బారి నుంచి నిన్న ఒక్కరోజే 3307మంది కోలుకున్నారు. తద్వారా మొత్తం డిశ్చార్జీల సంఖ్య 3,30, 304కు పెరిగింది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 83శాతంగా ఉంటే, తెలంగాణలో అది 83.57 శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. కొత్త కేసుల వెల్లువతో యాక్టివ్ కేసులు 32, 929కి పెరిగాయి.
కాగా, కరోనా కేసులు, మరణాల విషయంలో కేసీఆర్ సర్కారు చెబుతున్నవన్నీ దొంగ లెక్కలని ఆరోపిస్తూ, అసలైన సంఖ్యను బయటపెట్టాలని, కొవిడ్ ప్రోటోకాల్స్ కచ్చితంగా అమలయ్యేలా చూడటంతోపాటు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని కోరుతూ డాక్టర్ ఆలపాటి లక్ష్మీ లావణ్య ఆధ్యర్యంలో మొత్తం 40 మంది డాక్టర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘాటు లేఖ రాయడం చర్చకు దారితీసింది. తెలంగాణ సర్కారు ప్రకటిస్తోన్న కరోనా లెక్కలపై అటు హైకోర్టు, ఇటు ప్రతిపక్షాలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇప్పుడు డాక్టర్లు కూడా సీఎంకు లేఖ రాయడం గమనార్హం. కాగా,
షాకింగ్: ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలుడు -27మంది కొవిడ్ రోగులు దుర్మరణం, మరో 50 మందికి
మున్సిపల్ ఎన్నికల్లో వైరస్ వ్యాప్తి..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ ప్రకారం కొత్త కేసులు నమోదైన తీరును పరిశీలిస్తే, మున్సిపల్ ఎన్నికలు జరుగుతోన్న జిల్లాల్లో వైరస్ వ్యాప్తి పెరిగినట్లు అర్థమవుతోంది. కరోనా విలయం తొలి నుంచి తీవ్ర ప్రభావానికి లోనవుతోన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 1259 కేసులు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 676, రంగారెడ్డి జిల్లాలో 591 కేసులు రాగా, కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతోన్న వరంగల్ అర్బన్ జిల్లాలో 334 కొత్త కేసులు, వరంగల్ రూరల్ జిల్లాలో 175 కేసులు వచ్చాయి. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల వేళ ఆ జిల్లాలో కొత్తగా 339 కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 346, సిద్దిపేట జిల్లాలో 306 కొత్త కేసులు వచ్చాయి. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్, సిద్దిపేట మున్సిపాలిటీలకు ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది.