బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం.. కేసీఆర్కు సంపూర్ణ మద్దతు : సీపీఐ నారాయణ
కేంద్రం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపణలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్ బడా బాబులకు బాసటగా ఉంది తప్ప.. పేదల భరోసా ఇచ్చేలా లేదని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంటే ప్రధాని మోదీకి చిన్న చూపని దుయ్యబట్టారు. బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులపై మోదీ ప్రభుత్వం ప్రతీకారం
దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే వ్యవసాయ చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అంతే కానీ రైతులపై బీజేపీకి ఎలాంటి ప్రేమ లేదని మండిపడ్డారు. రైతులపై ప్రతీకారంతోనే ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేంద్రం ఎలాంటి కేటాయింపులు చేయలేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో సామాన్యుల జీవితాలు మరింత దుర్భరమైయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వైద్యానికి బడ్జెట్లో సరైన కేటాయింపులు చేయలేదన్నారు.
బీజేపీపై పోరులో కేసీఆర్కు మద్దతు
కేంద్ర బడ్జెట్పై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్లు నారాయణ తెలిపారు. కేసీఆర్ వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. తెలుగు రాష్ట్రాలకు నయాపైసా నిధులు ఇవ్వలేని ఆరోపించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామన్నారు. ఈ పోరాటంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా తాము మద్దతు ఇస్తున్నట్లు నారాయణ ప్రకటించారు. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీని కూడా కలుపుకొని వెళ్తామని స్పష్టం చేశారు.
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర
భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని నారాయణ ఆరోపించారు. మతతత్వ శక్తులకు ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా కృషి చేస్తున్నట్లు నారాయణ తెలిపారు.