కేసీఆర్ చేయగలరు - కాంగ్రెస్ కు ఆ శక్తి లేదు : అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తు - చాడా..!!
తెలంగాణలో కొత్త పొత్తులు మొదలయ్యాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మునుగోడు బై పోల్ నుంచే ఈ పొత్తులు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కమ్యనిస్టులతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన చేసినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కమ్యూనిస్టు ముఖ్య నేతలతో చర్చలు చేసారు. మునుగోడుతోనే కాదు..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకొనేందుకు సూత్ర ప్రాయంగా నిర్ణయం జరిగింది. దీంతో..ఇప్పుడు మునుగోడులో బీజేపీకి ఏ విధంగానూ అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో... కమ్యూనిస్టు పార్టీతో పొత్తుకు నిర్ణయించారు.

వచ్చే ఎన్నికల్లోనూ పొత్తు కంటిన్యూ
దీనిని అధికారికంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట రెడ్డి నిర్దారించారు. మునుగోడులో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉంది. దీనిని సద్వినియోగం చేసుకొనేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. వెంటనే చర్చలు చేసారు. ఇప్పుడు మునుగోడు సభలో సీపీఐ తమ మద్దతు టీఆర్ఎస్ అభ్యర్ధికేనని ప్రకటించనుంది. ఇదే సమయంలో చాడా కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి కేవలం టీఆర్ఎస్ కు మాత్రమే ఉందని స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు బలం ఏంటో..బలహీనతలు ఏంటో తామకు బాగా తెలుసని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ పరిస్థితి అలా ఉంది
2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరును ఆయన ప్రస్తావించారు. ఆ సమయంలో కాంగ్రెస్ మూడు సీట్లు తమకు కేటాయించి..అక్కడా తమ పార్టీ రెబల్స్ ను బరిలోకి దించిందని చెప్పుకొచ్చారు. నాడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఇబ్బంది పెట్టారని చాడా చెప్పారు. రాజగోపాల్ రెడ్డి స్వార్దం కోసం పార్టీ మారారని ఆరోపించారు. ఉప ఎన్నిక ప్రజల మీద రుద్దారని దుయ్యబట్టారు. వాస్తవంగా తాము మునుగోడు లో పోటీ చేయాల్సి ఉందని.. కానీ, బీజేపీని ఓడించటం కోసమే టీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా.. తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడుతున్న పార్టీగా రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

మునుగోడు ఫలితం పైనే..భవిష్యత్
ప్రగతి శీల శక్తుల ఏర్పాటు కు కెసిఆర్ ప్రయత్నం చేస్తున్నారని చాడా చెప్పుకొచ్చారు. దీని ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లొనూ టీఆర్ఎస్- వామపక్షాల మధ్య పొత్తు కంటిన్యూ అవ్వటం ఖాయంగా కనిపిస్తోది. అయితే, మునుగోడు ఫలితాల తరువాత మాత్రమే దీని పైన అధికారికంగా నిర్ణయం ఉండే ఛాన్స్ ఉందనే చర్చ కూడా వినిపిస్తోంది. దీంతో..ఇప్పుడు కమ్యూనిస్టు ప్రాబల్యం ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త టెన్షన్ మొదలయింది. ఇక..టీఆర్ఎస్ తో సీపీఐ కలవటంతో మునుగోడులో ఎంత మేర కలిసి వస్తుందనేది ఇప్పుడు కీలకం కానుంది.












Click it and Unblock the Notifications