మావోయిస్టులను చంపడమే అజెండానా?: కేసీఆర్కు చాడ సూటి ప్రశ్న
హైదరాబాద్: ఇటీవల వరంగల్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన మావోయిస్ట్ ఎన్ కౌంటర్పై తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి మండిపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ ఘటనపై ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మావోయిస్టుల అజెండానే తమ అజెండా అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్కు వారిని చంపడమే అజెండానా? అని నిలదీశారు. గత పాలకులకు, కేసీఆర్ పాలనకు ఏమాత్రం తేడా లేదని ఆయన చెప్పారు. పోలీసులకు అత్యాధునిక వాహనాలు సమకూర్చింది ప్రజలను రక్షించడానికా? లేక చంపడానికా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఆగడాలకు బ్రేకులు వేసేందుకు కొత్తగా తెలంగాణ ప్రజాస్వామిక వేదికను ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఈనెల 30న చలో అసెంబ్లీ చేపడతామని తెలిపారు. 29న వరంగల్ లో పార్లమెంటు ఉప ఎన్నికలపై వామపక్ష పార్టీలు సమావేశమై, అక్కడ పోటీ చేసే అభ్యర్థి ఎవరన్నది నియమిస్తామన్నారు.

అదే విధంగా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలంటూ అక్టోబర్ 2న అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తామని పేర్కొన్నారు. మరోవైపు వరంగల్ ఎన్కౌంటర్లో చనిపోయిన ఎంటెక్ విద్యార్ధిని శృతికి ఆమె తండ్రి, విరసం సభ్యుడు సుదర్శన్ శుక్రవారం నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమార్తె చనిపోయినందుకు తాను బాధ పడటం లేదని, తన ఆశయ సాధనలో భాగంగానే ఆమె ఆత్మబలిదానం చేసిందని చెప్పారు. బతుకమ్మ ఆటలాడే ఎంపీ కవితకు ఓ మహిళ ఎన్ కౌంటర్ లో బలి అయితే బాధ కలగలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్ కౌంటర్ పై ఆమె ఎందుకు స్పందించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications