హరితహారంలో ఎర్రబెల్లికి చుక్కెదురు : సీపీఎం, సీపీఐ 'గో బ్యాక్' నినాదాలు..
వరంగల్ / తొర్రూరు : టీఆర్ఎస్ లో చేరిన తర్వాత మీడియాలో అంతగా ఫోకస్ అవని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా వార్తల్లోకి ఎక్కారు. హరితహారంలో భాగంగా.. మండలంలోని కంఠాయపాలెంలో మొక్కలు నాటడానికి వెళ్లిన ఆయనను సీపీఐ, సీపీఎం నాయకులు అడ్డుకున్నారు.
ప్రభుత్వం హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. నేతలంతా ఆయా నియోజకవర్గాల్లో హరితహారాన్ని ఉధృతం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కంఠాయపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటడానికి వెళ్లారు ఎర్రబెల్లి. అయితే గతంలో కంఠాయపాలెంను దత్తత తీసుకున్నట్లుగా ప్రకటించిన ఎర్రబెల్లి.. ఇంతవరకు అక్కడ ఎలాంటి అభివృద్ది పనులు తలపెట్టలేదని ఆరోపిస్తూ ఎర్రబెల్లికి అడ్డుపడ్డారు సీపీఎం, సీపీఐ కార్యకర్తలు.
టీఆర్ఎస్ ప్రభుత్వం రెండేళ్లు గడుస్తున్నా..! ఇంతవరకు ఏ అభివృద్ది లేదని ఎర్రబెల్లిని నిలదీశారు సదరు నాయకులు. దీంతో ఎర్రబెల్లికి సదరు నాయకులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకోగా.. ఆగ్రహించిన సదరు నాయకులు 'ఎర్రబెల్లి గో బ్యాక్' నినాదాలు చేశారు.
ఆందోళనకారులను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. పీఐ గ్రామ కార్యదర్శి మందపురి శ్యాం, సీపీఎం మండల నాయకుడు ఎండీ యాకూబ్, వీరభద్రంను అదుపులోకి తీసుకున్నారు.
అభివృద్ది లేదనేది అవాస్తవం :
ఆందోళనకారులు వాదిస్తున్నట్టుగా గ్రామాభివృద్ది కోసం తానేమి చేయలేదన్న వ్యాఖ్యలను ఎర్రబెల్లి కొట్టిపారేశారు. ఆ వాదనలో నిజం లేదన్న ఆయన.. రాబోయే ఆరు నెలల్లో గ్రామ రూపు రేఖలు మారుస్తానని గ్రామస్తులకు హామి ఇచ్చారు.