కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క గుడ్బై- మరో డజనుమంది సీనియర్లు కూడా..!!
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో సంక్షోభం మరింత ముదిరింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించడంతో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధిష్ఠానం ఇటీవలే నియమించిన పోస్టులు.. పార్టీలో చిచ్చు పెట్టినట్టే కనిపిస్తోంది. ఇటీవలే పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా మరి కొందరు సీనియర్ నాయకులు అదే బాట పట్టారు.

ఎన్నికల సమయంలో..
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో- తలెత్తిన ఈ సంక్షోభ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టినట్టయింది. ఒక్కొక్క నాయకుడు రాజీనామా బాట పట్టడం, అదే సమయంలో భారతీయ జనతా పార్టీలో చేరాలంటూ ఆహ్వానాలు అందుతోండటం.. కలవరపాటుకు గురి చేస్తోంది అధిష్ఠానానికి. దీనితో దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.

చిచ్చు పెట్టిన ఎగ్జిక్యూటివ్ కమిటీ..
ఈ మధ్యే ఏఐసీసీ.. కొత్తగా టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సభ్యురాలిగా కొండా సురేఖను నియమించారు. దాన్ని ఆమె తిరస్కరించారు. ఓ సాధారణ సభ్యురాలిగా తనను అపాయింట్ చేసి, అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాన్ని తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్కు పంపించారు. కమిటీల నియామకంలో సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదని కొండా సురేఖ వాదన.

కొండా సురేఖ బాటలో..
ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. పీసీసీ ఇచ్చిన పోస్టులను పలువురు సీనియర్ నాయకులు తిరస్కరించారు. రాజీనామా చేశారు. సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏఐసీసీ కార్యదర్శులు హాజరైన అత్యంత కీలక సమావేశం ఇది. దీనికి దూరంగా ఉండాలని పలువురు సీనియర్లు తొలుత నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే తమ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.

సీతక్క సహా..
ఎమ్మెల్యే సీతక్క సహా కాంగ్రెస్ పార్టీకి 12 మంది రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను మాణిక్కం ఠాకూర్కు పంపించారు. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో సీతక్క ములుగు నియోజక వర్గం నుంచి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్కు చెందిన అజ్మీరా చందూలాల్ను ఆమె మట్టి కరిపించారు. ఆ తరువాత పీసీసీలో కీలక పాత్ర పోషించారు.

ఎర్ర శేఖర్ సహా..
రాజీనామా చేసినవారిలో వేం నరేందర్ రెడ్డి, విజయరామారావు, చారకొండ వెంకటేష్, ఎర్ర శేఖర్, పటేల్ రమేష్, సత్తు మల్లేష్, దొమ్మాటి సాంబయ్య, జంగయ్య యాదవ్, కే సత్యనారాయణ, సుభాష్ రెడ్డి, చిలుక మధుసూదన్ రెడ్డి, శశికళ యాదవ రెడ్డి ఉన్నారు. వారంతా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్కు వలస వచ్చిన నాయకులే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకునే తమ పదవులకు గుడ్బై చెప్పారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications