సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ పై మొదలైన విమర్శలు!!
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ప్రజాదర్బార్ పట్ల కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే మరికొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడం కోసం ప్రజలతో నేరుగా మాట్లాడటం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాచరిక పోకడలను తలపిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో రాజుల కాలం ప్రజాదర్బార్లు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే వారని, ఇప్పుడు కూడా అదే తరహాలో రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ పని ప్రచార ఆర్భాటాలకు తప్ప, క్షేత్రస్థాయిలో పని జరగడానికి పనికిరాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇది పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు. ప్రజా దర్బార్ పట్ల విమర్శలు వ్యక్తం కావడం వెనుక కారణాలు కూడా లేకపోలేదు.

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతమంది సమస్యలను ప్రజా దర్బార్ ద్వారా పరిష్కరించగలుగుతారు? ఎంత కాలం పాటు ఆయన ఈ కార్యక్రమాన్ని కొనసాగించగలుగుతారు? అనేది అందరిలోనూ ఉన్న అనుమానం. ఇది మాత్రమే కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రతి జిల్లాలోనూ ప్రతి వారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ లో ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోంది.
ఇక మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖ పరిధిలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార యంత్రాంగం వద్దకు వచ్చిన సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తే అసలు సమస్యలే ఉండవు. ఇక ఆ దిశగా రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగంతో పని చేయిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
అంతేకాకుండా ఎమ్మెల్యేలుగా గెలిచినవారు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తే సరిపోతుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అసలు ప్రతి వారం గ్రీవెన్స్ కి వస్తున్న సమస్యలెన్ని? పరిష్కారం అవుతున్న సమస్యలు ఎన్ని? అన్నీ ఎందుకు పరిష్కారం కావటం లేదు అనేది దృష్టి సారిస్తే మిగతా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పైన ఫోకస్ చేస్తే సరిపోతుంది.
ప్రజా దర్బార్ పేరుతో జనాలను నేరుగా వచ్చి సమస్యలు చెప్పాలని చెప్పడం కేవలం చెప్పుకోవడానికి పనికి వస్తుంది తప్ప క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలను ఇవ్వదు అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గత సీఎం నేరుగా ప్రజలను కలవలేదు కాబట్టి ప్రస్తుత సీఎం నేరుగా ప్రజలను కలిసే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అర్థమవుతుంది.
అయితే ఈ కార్యక్రమం ద్వారా నిజంగా ఆశించిన ఫలితాలు వస్తాయని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలావరకు భావించడం లేదు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహణ పట్ల కొంతమంది నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆరంభ శూరత్వం అవుతుందేమో అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications