పసితనాన్ని కాటేసిన కర్కషత్వం..! స్వగ్రామం, తల్లి దండ్రుల పేర్లు చెప్పలేకపోతున్న ధర్మపురి బాలికలు..!
జగిత్యాల/హైదరాబాద్ : జగిత్యాల వేశ్యా గ్రుహాల్లో పట్టుబడ్డ చిన్నారుల పరిస్థితి కడు దయనీయంగా తయారయింది. చుట్టూ జరుగుతున్న దాని గురించి పూర్తిగా తెలుసుకోలేని వయసులోనే 'ధర్మపురి' వ్యభిచార గృహంలో చిక్కుకుపోయి, ఇటీవల వెలుగులోకి వచ్చిన బాలికల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ ఘోరం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆ బాలికల వివరాలు తెలుసుకుందామని ప్రయత్నిస్తున్న పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకడంలేదు.
పసిప్రాయంలోనే తల్లిదండ్రులకు దూరమై, ఆ మాయగాళ్ల చేతిలో చిక్కుకుపోయిన ఆ ఐదుగురు బాలికల్లో ఒక్కరు కూడా తమ ఊరు, తల్లిదండ్రుల వివరాలు చెప్పలేకపోతున్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. తమకు ఏమీ గుర్తుకు రావడం లేదని చెప్పడం అత్యంత విషాదకరమని పోలీసులు అంటున్నారు.
పిల్లల మానసిక పరిస్థితిని బట్టి ఆ బాలికలను పసి ప్రాయంలోనే కొనుగోలు చేసి ధర్మపురి స్థానికులుగా తప్పుడు పత్రాలు సృష్టించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా వారి గురించి తెలుసుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా లాభం లేదని వారు చెప్పారు.
పట్టుబడిన ఐదుగురిలో ఒకరు ఇంటర్ ప్రథమ సంవత్సరం చదవగా.. ఒకరు 8, ఇద్దరు 5, ఇంకొకరు 1వ తరగతి చదివారు. గత ఏడాది ఆగస్టులో యాదగిరిగుట్టలో వ్యభిచార ముఠా వెలుగులోకి వచ్చినప్పుడు కూడా వీరు ధర్మపురిలోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అప్పుడు వీరిని రహస్య ప్రాంతాలకు తరలించి ఉండొచ్చని భావిస్తున్నారు.