ఆ 'టైమ్' డేంజర్: హైదరాబాద్ యాక్సిడెంట్స్లో కీలక నిజాలు, కారణమేంటి?
సైబరాబాద్ పరిధిలో సాయంత్రం 6గం.-9గం. మధ్యలో అత్యధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు.
Recommended Video
హైదరాబాద్: నిత్యం పదుల సంఖ్యలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలపై అధికారులు సీరియస్గా ఫోకస్ చేశారు. ప్రమాద కారణాలను లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేశారు.
ఏ టైమ్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి?.. ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలేంటి? అన్న అంశాలపై ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
ఆ టైమ్ లోనే ఎక్కువగా:
సైబరాబాద్ పరిధిలో సాయంత్రం 6గం.-9గం. మధ్యలో అత్యధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. గత ఎనిమిది నెలల్లో సాయంత్రం 6గం.-9గం. మధ్య 107ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు నివేదిక చెబుతోంది. అతి తక్కువగా వేకువజామున 3గం.-6గం. మధ్యలో 29 ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి.
కారణాలేంటి?:
సాయంత్రం 6గం.-9గం. సమయంలో విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకు చేరుకుంటుంటారు.ఆ సమయంలో బాగా అలసిపోయి ఉండటం, త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆత్రుతలో వేగంగా డ్రైవింగ్ చేయడం వంటివి ప్రమాదాలకు దారితీస్తున్నట్లు గుర్తించారు. ఆ సమయంలో రోడ్లపై వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుండటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు జరుగుతున్నాయి.
పెరుగుతున్న డ్రంకన్ డ్రైవ్:
మద్యం తాగి వాహనాలు నడుపుతుండటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. డ్రంకన్ డ్రైవ్ పట్ల పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. చాలామంది వాహనదారుల్లో మార్పు రావట్లేదు. డ్రంకన్ డ్రైవ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు.
స్ట్రీట్ లైట్స్:
ఔటర్ రింగు రోడ్డుపై చాలా చోట్ల స్ట్రీట్ లైట్స్ పనిచేయట్లేదు. దీంతో చిమ్మ చీకట్లోనే వాహనాలు నడపాల్సి వస్తోంది. భారీ వర్షాలకు రహదారుల్లో ఏర్పడిన గుంతలు కూడా వారికి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దీంతో రాత్రివేళ వాహనాలు నడపడటం నరకంగా మారింది. సరైన రోడ్లు లేకపోవడం, దానికి తోడు సాయంత్రం సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో వాహనదారులకు తిప్పలు తప్పట్లేదు.