వరుసగా పేలిన సిలిండర్లు: పరుగుపెట్టిన యువతులు
హైదరాబాద్: నగరంలో మంగళవారం ఓ పెను ప్రమాదం తప్పింది. కవాడిగూడలోని ఓ భవనంలో గ్యాస్ సిలిండర్లు ఒకదాని తరువాత ఒకటి వరుసగా మూడు పేలాయి. దీంతో భవనం కంపించిపోయింది. మొదటి అంతస్తులో ఉంటున్న 60 మంది యువతులు భయాందోళనతో కిందకు పరుగులు తీశారు.
భారీ శబ్ధం రావడంతో స్థానికులు కూడా తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. కాగా, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. అయితే ఓ కారు మాత్రం పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళితే.. కవాడిగూడ డీబీఆర్మిల్లు వెనుక ఎస్బీహెచ్ కాలనీ రోడ్డులో నాలుగు అంతస్తుల బ్రామరి నిలయం ఉంది. గ్రౌండ్ఫ్లోర్ మడిగిలో బాలరాజ్ అనే వ్యక్తి కారు మెకానిక్ షెడ్డు నడుపుతున్నాడు.
మిగిలిన మూడు అంతస్తుల్లో బ్రామరి ఉమెన్స్ హాస్టల్ నడుస్తోంది. అందులో ఉన్న 60 మంది గ్రూప్స్ శిక్షణ తీసుకుంటున్నారు. 4వ అంతస్తులో భవనం యజమాని రమేశ్ కుటుంబసభ్యులు నివసిస్తున్నారు.
కాగా, మంగళవారం సాయంత్రం మెకానిక్ షెడ్లో బాలరాజ్ మరో డ్రైవర్ ఇద్దరూ కలిసి ఇంటి వంటకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల నుంచి కారు సిలిండర్లోకి గ్యాస్ను ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో మంటలు చెలరేగడంతో గమనించిన ఇద్దరు పరుగులు తీశారు.
అంతే వరుసగా మూడు సిలిండర్లు కూడా పేలిపోయాయి. దీంతో భవనం కంపించిపోయింది. హాస్టల్లోని యువతులు ఏం జరిగిందో అర్థం కాక కేకలు వేస్తూ మెట్ల ద్వారా కిందికి పరుగులు తీశారు. ఘటనను తలుచుకుంటూ కన్నీటిపర్యాంతమయ్యారు.
సమాచారం అందుకున్న గాంధీనగర్ ఇన్స్పెక్టర్ సంజీవరావు 50 మంది సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పేలని మిగిలిన సిలిండర్లు ఉండవచ్చనే అనుమానంతో భవనం ఖాళీ చేయించారు. అగ్నిమాపక దళాన్ని రప్పించి మంటలు ఆర్పారు.