ఏపీ-టీ రగడ: రంగంలోకి డిఎస్!, బాబు-మోడీ భేటీపై టిఆర్ఎస్ 'భారీ' కన్ను
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సలహాదారు డి శ్రీనివాస్ సోమవారం నాడు గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. తద్వారా రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాల పరిష్కారానికి తెలంగాణ నడుం బిగించింది.
అంతర్ రాష్ట్ర వివాదాలపై ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులైన డి శ్రీనివాస్ రాజ్భవన్లో గవర్నర్ను సోమవారం కలిశారు. వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాల పరిష్కారం అంశంపై గవర్నర్తో చర్చించినట్టు డి శ్రీనివాస్ తెలిపారు.
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలతో పలు అంశాల్లో వివాదాలున్నాయి. ఇతర రాష్ట్రాలతో ఇరిగేషన్ ప్రాజెక్టులపై స్వల్పంగా వివాదాలు ఉన్నా, డి శ్రీనివాస్ మాత్రం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్రం వివాదాలపై దృష్టి సారించనున్నారు.
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి చొరవ చూపాలని, అదే విధంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన ప్రయోజనాలపై దృష్టిసారించాలని డి శ్రీనివాస్ గవర్నర్ను కోరారు.
ప్రధాని మోడీ - ఏపీ సీఎం చంద్రబాబు భేటీపై టీఆర్ఎస్ కన్ను
ప్రధాని మోడీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుల భేటీ పైన టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నేసింది. వారికి ఇచ్చే హామీలను బట్టి ముందుకెళ్లాలని చూస్తున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణకు ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
దీని కోసం ముఖ్యమంత్రి కెసీఆర్ త్వరలోనే ప్రధానమంత్రిని కలవనున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలంగాణ నాయకులు చాలా రోజులుగా చెబుతోన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాదని తేలిపోవడంతో దానిని పక్కన పెట్టేశారు.
ఏపీకి భారీగానే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే పరిస్థితుల్లో విభజన చట్టంలో ఉన్న హామీలనైనా అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురైంది తెలంగాణ ప్రాంతం, అందుకోసమే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించామని, సాధించామని, తెలంగాణలోని ఏడు జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా ప్రణాళికా సంఘమే గుర్తించిందని, ప్రత్యేక ప్యాకేజీ తెలంగాణకు కూడా ఇవ్వాలని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఏపీకి ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీ ఏ విధంగా ఉంటుందో చూడాలని, ఆ తర్వాత తెలంగాణకు ప్యాకేజీ కోసం ప్రభుత్వాన్ని కోరుతామంటున్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశంపై ప్రధాని మోడీతో మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. బాబుకు మోడీ నుంచి ఎలాంటి హామీ లభిస్తుందో అనే అంశంపై ఏపీ నాయకులతో పాటు తెలంగాణ నాయకుల్లో ఆసక్తి నెలకొంది.
ప్రధాని మోడీ ఇటీవల బిహార్కు లక్షా 65వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఇలాంటి భారీ ప్యాకేజీపై ఆంధ్రప్రదేశ్ ఆశలు పెట్టుకొంది. విభజన జరిగిన ఇరు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి భారీ ప్యాకేజీ ప్రకటించి మరో రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసే అవకాశం ఉండదని టిఆర్ఎస్ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రకటించారు.