మోడీ దురహంకారానికి పరాకాష్ట: రాహుల్ అనర్హత వేటుపై కేసీఆర్ తీవ్ర స్పందన
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్ర నేత, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. రాహుల్పై అనర్హత వేటు భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని అభివర్ణించారు. ఈ చర్య ప్రధాని నరేంద్ర మోడీ దురహంకారం నియంతృత్వానికి పరాకాష్ట అని ఘాటుగా స్పందించారు.
రాహుల్ అనర్హత వేటుపై ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ తన నిరసనను తెలియజేశారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్ర మోడీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట. రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోడీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జన్సీని మించిపోతోంది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
కాగా, మోడీ ఇంటి పేరు గలవారందరూ దొంగలేనంటూ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో పార్లమెంటు సభ్యుడైన రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది.
మరోవైపు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఆయనపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆరోపించారు. అత్యంత అప్రజాస్వామిక పద్ధతిలో రాహుల్ పై వేటు వేశారని అన్నారు. ఇది తొందరపాటు చర్య అని వ్యాఖ్యానించారు.