తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్కు తాత్కాలిక బ్రేక్... 4 రోజుల పాటు విరామం...
తెలంగాణలో నాలుగు రోజుల పాటు కరోనా వ్యాక్సినేషన్కు బ్రేక్ ఇవ్వనున్నారు.దసరా పండగ నేపథ్యంలో వైద్య సిబ్బంది విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గురువారం(అక్టోబర్ 14) నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోనుంది.
దసరా పండగ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు తాత్కాలిక విరామం ప్రకటించాలని వైద్య సిబ్బంది సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.సీఎం దీనిపై సానుకూలంగా స్పందించి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. శుక్రవారం(అక్టోబర్ 15) దసరా పండుగ కాగా.. బుధ,గురువారాల్లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి.సాధారణంగా రాష్ట్రమంతా ఒకేసారి సద్దుల బతుకమ్మ ఉత్సవాలు జరుగుతుంటాయి.కానీ ఈసారి కొన్నిచోట్ల బుధవారం,మరికొన్నిచోట్ల గురువారం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సద్దుల బతుకమ్మ ఉత్సవాలపై తెలంగాణ పండితులు,పూజారులు వేర్వేరు తేదీలు ప్రకటించడంతో ఈ పరిస్థితి నెలకొంది.
కరోనా వ్యాక్సినేషన్ విషయానికి వస్తే... రాష్ట్రానికి ఈ నెలలో మరో 1 కోటి కొవిడ్ వ్యాక్సిన్ డోసులు అందనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపిన సంగతి తెలిసిందే.ఇప్పటివరకూ రాష్ట్రంలో 2.80 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. ఇందులో 2.02 కోట్ల మందికి మొదటి డోస్ పూర్తయిందని, రోజూ మూడు నుంచి నాలుగు లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో మరో ఆరు మెగా వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మంగళవారం నాటి హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 44,310 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. వారిలో 196 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారించారు. మరో 1543 మందికి సంబంధించిన కొవిడ్-19 రిపోర్ట్స్ రావాల్సి ఉంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనవైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య మొత్తం 6,68,266కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా వైరస్తో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 3,933కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 6,60,143 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 4,190 యాక్టివ్ కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.