అధికారిక లాంఛనాలతో రేపు దాసరి అంత్యక్రియలు: మంత్రి తలసాని
తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతూ కిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి కన్నుమూసిన ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో బుధవారం చేవెళ్లలోని ఫాంహౌస్లో జరగనున్నాయి.
హైదరాబాద్: తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతూ కిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి కన్నుమూసిన ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తరలించారు.
బుధవారం చేవెళ్లలోని ఫాంహౌస్లో ఆయన అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. దాసరి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగేలా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేసినట్లు మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ చలనచిత్ర పరిశ్రమలో పులిలాగ జీవించిన వ్యక్తి దాసరి అని అన్నారు. చలనచిత్ర పరిశ్రమలో ఎందరినో పైకి తెచ్చిన మహానుభావుడు అని కొనియాడారు.
దాసరి నారాయణ రావు పార్ధివ దేహానికి బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి ప్రజలు నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం పదిన్నరకు దాసరి ఇంటి నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది.
చేవెళ్ల రోడ్లోని ఫాంహౌస్లో దాసరి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. భార్య సమాధి పక్కనే ఆయన సమాధి కట్టనున్నారు. దాసరి మృతికి సంతాపంగా రేపు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమతోపాటు, సినిమా థియేటర్లు కూడా బంద్ పాటించనున్నాయి.