డేటా చోరీ కేసు... ఐటీగ్రిడ్ యజమాని అశోక్ ఎవరు ? ఆయన ఏం చేశాడు ?
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సేవా మిత్ర యాప్ ద్వారా జరిగిన డేటా చోరీ కేసులో అశోక్ ను ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు తెలంగాణా పోలీసులు . ఏపీ ప్రజల కీలక సమాచారాన్ని చోరీ చేసిన కేసులో సైబరాబాద్ పోలీసులు ఐటి గ్రిడ్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ పై లుకవుట్ నోటీసులు జారీ చేశారు. అతన్ని పట్టుకోవడానికి అవసరమైన రంగం సిద్ధం చేస్తున్నారు.

అశోక్ ది నెల్లూరు.. చదివింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐటీ గ్రిడ్ వివాదం తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైంది. ఈ ఐటి గ్రిడ్ సంస్థ నిర్వాహకుడైన అశోక్ ఎవరు? అసలు తను ఏం చేస్తాడు ? అన్నది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన దాకవరపు అశోక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి . అశోక్ కర్ణాటకలోని దావణగెరెలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశాడు. తొలినాళ్లలో టీడీపీ కార్యకర్తగా పనిచేసినట్లు తెలుస్తోంది. తద్వారా ఆ పార్టీకి చెందిన కొందరు కీలక వ్యక్తులతో, పార్టీ ముఖ్యులతో అతనికి పరిచయాలు ఏర్పడ్డాయి. క్రమంగా ఆ పరిచయాలు నారా లోకేష్ కు సాన్నిహిత్యంగా ఉండేలా చేశాయి.

అశోక్ ఐటీ గ్రిడ్స్ కు టీడీపీ వెన్నుదన్ను
టీడీపీలోని ముఖ్యుల పరిచయాల ప్రభావంతో తాను చదువుకున్న కంప్యూటర్ సైన్స్ ను ఆధారంగా చేసుకొని ఐటీ గ్రిడ్స్ సంస్థ నెలకొల్పాడు. తెలుగుదేశం పార్టీ కోసం తన సంస్థ ద్వారా పనిచేశాడు అశోక్. . అతనితోపాటు మరో నలుగురితో ఏర్పాటైన అనధికారిక కమిటీ అధ్యయనం చేసిన తర్వాత సేవామిత్ర యాప్కు రూపకల్పన చేశారు .దానివల్లనే టీడీపి నంద్యాలలో టీడీపి గెలిచిందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సేవ మిత్ర యాప్ ను రూపొందించి అది సక్సెస్ కావడంతో, పార్టీకి సంబంధించిన పలు ఐటీ సేవలను అశోక్ తన సంస్థ ద్వారా అందిస్తున్నారు.

కీలక సమాచారం సేకరించిన పోలీసులు
ఈ సంస్థ నిర్వహించిన సేవా మిత్ర యాప్కు చెందిన ప్రాసెస్డ్ డేటా మొత్తం దాని క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా భద్రపరిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మరోమారు
సైబరాబాద్ పోలీసు లు మంగళవారం కూడా హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఎథికల్ హ్యాకర్ల సాయంతో చేసిన ఈ తనిఖీల్లో అత్యంత కీలకమైన సమాచారం లభించినట్లు తెలుస్తోంది. తెలంగాణ పోలీసులకు చిక్కకుండా, దర్యాప్తునకు సహకరించకుండా అతను ఏపీలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ కేసులో అశోక్ ఉపయోగించిన ఐ ఫోన్ కీలకం కానుంది . టీడీపీ లో ఒక కార్యకర్తగా మొదలైన అశోక్ ప్రస్థానం టీడీపీ సహకారంతో ఐటీ గ్రిడ్స్ సంస్థ పెట్టేలా చేసింది. అయితే ఈ సంస్థ వెనుక మరే ఇతర రాజకీయ శక్తులు పని చేశాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications