టెలీకాలర్స్తో అప్పుల మోసం: ఢిల్లీ ముఠా పట్టివేత
హైదరాబాద్: ఢిల్లీ కేంద్రంగా అప్పుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తామంటూ దేశవ్యాప్తంగా 200మంది టెలికాలర్స్ను నియమించుకొని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు మోసగాళ్లు హైదరాబాద్ క్రైం పోలీసులకు పట్టుబడ్డారు.
రుణాల మంజూరు కోసం కొంత ఫీజు, వివిధ డాక్యుమెంట్ల ఖర్చుల కోసం డిపాజిట్లు చేయించుకొని మోసానికి పాల్పడుతున్న వారిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 8లక్షలు నగదు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు నగర జాయింట్ కమిషనర్ (డిటెక్టివ్) ప్రభాకర్రావు తెలిపారు. న్యూఢిల్లీ కేంద్రంగా అమాయకులను మోసం చేస్తున్న ప్రియాంష్ ఫౌండేషన్, డయల్ ఈజీ నెట్వర్కు ప్రైవేటు లిమిటెడ్, కేర్ ఇండియా ఫౌండేషన్ సంస్థల ద్వారా వందలాది అమాయకులకు దాదాపు రూ. 2 కోట్లు కుచ్చుటోపి పెట్టినట్టు తెలుస్తుందని జెసి ప్రభాకర్రావు తెలిపారు.
గురువారం నగరంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. నగరంలోని గన్ఫౌండ్రికి చెందిన వ్యాపారి నిశ్చల్ నరేంద్ర ప్రసాద్కు అక్టోబర్ 17న, నేహ గుప్తా పేరిట ఒక కాల్ వచ్చిందని, తక్కువ వడ్డీతో కొటక్ మహేంద్ర బ్యాంక్లో రుణ సౌకర్యం కల్పిస్తామని నమ్మబలికింది. పది లక్షల రుణానికి గానూ ప్రాసెసింగ్, మార్టిగేషన్ వంటి చార్జీలు చెల్లించాల్సి ఉంటుందంటూ రూ. 2,38,232లను డిపాజిట్ చేయించుకుంది. తరువాత రుణం కోసం ఫోన్ చేయగా స్పందించకపోవడంతో మోసపోయానంటూ ఫిర్యాదు చేసినట్టు జెసి తెలిపారు.
బాధితుని ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం బృందం నేహ గుప్తా ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా తిలక్నగర్, ఢిల్లీ కేంద్రంగా ఈ వ్యవహారం నడిపినట్టు తెలిసిందని, దీంతో తమ బృందం ఢిల్లీ వెళ్లి ప్రధాన నిందితులు మనీష్ టాండాన్, పునీత్ ముఖిజాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారిపై పిడి యాక్టు పెట్టనున్నట్టు తెలిపారు.