ఢిల్లీ లిక్కర్ స్కాం: అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు, ఫోన్ల ధ్వంసం
హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో మలుపు తిరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన అమిత్ ఆరోరాను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు.
సౌత్ గ్రూప్ను శరత్ రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా రూ. 100 కోట్లు విజయ్ నాయర్ కు చేరాయని తెలిపింది. ఈ విషయాన్ని అమిత్ అరోరా ధృవీకరించారని ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో సంబంధం ఉన్న మొత్తం 36 మంది 170 ఫోన్లు ధ్వంసం చేశారు. వాటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు 33 ఫోన్లు ధ్వంసం చేశారు. ధ్వంసమైన ఫోన్ల విలువ రూ. 138 కోట్లు. వాటిలో కవితకు చెందినవి 2 నెంబర్లు, 10 ఫోన్లు ఉన్నాయి. కవిత వాడిన 10 ఫోన్ల ఆధారాలు దొరక్కుండా ధ్వంసం చేశారు అని ఈడీ అధికారులు వెల్లడించారు.
ఇప్పటి వరకు ఈడీ ఎదుట అమిత్ అరోరా 22 సార్లు హాజరయ్యారని, ఫోన్ ద్వారా కూడా సమాచారం తీసుకున్నారని అమిత్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 22 సార్లు ప్రశ్నించిన తర్వాత అమిత్ కస్టడీ అవసరం ఏంటని ఈ సందర్భంగా కోర్టు ఈడీని ప్రశ్నించింది.
అయితే, మూడు సార్లు మాత్రమే వాంగ్మూలం నమోదు చేశామని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగింపు కోసమే కస్టడీ కోరుతున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఆమె పేరు రావడం సంచలనంగా మారింది.