నోట్ల రద్దు: పోస్టాఫీసుల్లో రూ.2.95 కోట్లు పక్కదారి, 17 లక్షల రూ.2వేల నోట్లు స్వాధీనం
తెలంగాణ రాజధాని హైదరాబాదులోని పోస్టాఫీసుల్లో జరుగుతున్న నగదు మార్పిడిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న సీబీఐ, ఆదాయపన్ను శాఖ అధికారులు మొత్తం 11 చోట్ల దాడులు జరిపారు.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులోని పోస్టాఫీసుల్లో జరుగుతున్న నగదు మార్పిడిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న సీబీఐ, ఆదాయపన్ను శాఖ అధికారులు మొత్తం 11 చోట్ల దాడులు జరిపి అన్ని వివరాలను సేకరించారు.
చట్టవిరుద్ధంగా ఇటువంటి చర్యలకు పాల్పడిన పోస్టల్ అధికారులు అబ్దుల్ గనీ, రవితేజ, సురేశ్ కుమార్, శ్రీనివాస్లను అరెస్టు చేశారు. వీరంతా సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ ప్రోత్సాహంతోనే నగదు మార్చారని అధికారులు గుర్తించారు.
మొత్తం రూ.2.95 కోట్ల నగదును అక్రమంగా మార్చారని చెప్పారు. అధికారుల ఇళ్లు, ఆఫీసులతో పాటు పలు ప్రాంతాల్లోనూ తాము సోదాలు జరిపినట్లు తెలిపారు. తాము జరిపిన దాడుల్లో మొత్తం 17.02 లక్షల విలువైన రూ.2 వేల కొత్త నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పోస్టాఫీసుల్లో కొందరు సిబ్బంది బ్రోకర్లతో కుమ్మక్కు అయ్యారు. హిమయత్ నగర్, గోల్కొండ, కార్వాన్ పోస్టాఫీసు సిబ్బందిపై కేసులు పెట్టారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. వారిని ప్రోత్సహించిన సుధీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు.