తెలంగాణలో డెంగ్యూ జ్వరం కలవరం: భారీగా పెరుగుతున్న కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ(డెంగీ) జ్వరం కేసులు భారీగా పెరుగుతుండటం కలవరానికి గురిచేస్తోంది. ఈ సంవత్సరానికి ముగియడానకి ఇంకో నాలుగు నెలలు మిగిలి ఉండగానే కేసులు 3109గా నమోదయ్యాయి. సంవత్సరం ముగిసేసరికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఈ జ్వరానికి మంచినీటిలో పెరిగే 'ఎడిస్ ఈజిప్టి' దోమ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ దోమలు కుట్టడం వల్ల డెంగీ జ్వరం వస్తుంది. రాజధాని హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ హైదరాబాద్లో అత్యధికంగా 12,205 నమూనాలను పరీక్షించారు. ఈ పరీక్షల్లో 1,470 మంది డెంగీ బారిన పడ్డారు. ఇక్కడ 12.04 పాజిటివిటీ నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 2,044 నమూనాలను పరీక్షించగా 322 మంది(15.75% పాజిటివిటీ రేటు)కి వ్యాధి నిర్ధారణ అయింది.
మేడ్చల్ జిల్లాలో 1,375 నమూనాలకు 165 మంది డెంగీ బారిన పడ్డారు. ఖమ్మంలో 3,815 నమూనాలకు గానూ 126 మంది వ్యాధికి గురైయ్యారు. కరీంనగర్ జిల్లాలో 1,011 నమూనాలను పరీక్షించగా 123 మందికి, సంగారెడ్డి జిల్లాలో 1,662 నమూనాలకు 88 మందికి, ఆదిలాబాద్ జిల్లాలో 729 నమూనాలను పరీక్షించగా.. 81 మందికి డెంగీ సోకింది.
ఎడిస్ ఈజిప్టి దోమ పెరిగే ఆవాసాలు ఇవే:
డెంగీ కారక 'ఎడిస్ ఈజిప్టి' దోమ పగటిపూటే కుడుతుంది. మన ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో నిల్వ ఉంచే మంచినీటిలోనే పుట్టి పునరుత్పత్తి చేస్తుంది. ఎయిర్ కూలర్లు, డ్రమ్ములు, పాత టైర్లు, రేకు డబ్బాల్లో నిల్వ ఉండే నీటిలో ఈ దోమ వృద్ధి చెందుతుంది.
డెంగీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలుం
ఎక్కడ కూడా నీరు ఎక్కువ రోజులు నిల్వ లేకుండా చూసుకోవాలి. మలేరియా దోమ మురుగునీటిలో వృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో పరిసరాల్లో మురుగు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్లు, పరిసరాల పరిశుభ్రతతో ఈ వ్యాధిని అరికట్టవచ్చని అధికారులు సూచిస్తున్నారు.