కొండా సురేఖ వెంట ఎంతమంది వెళ్తారు? రంగంలోకి నేతలు: 'కేసీఆర్ అప్పుడే పసిగట్టారు'
హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ తెరాసను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 12న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. తాము తెరాస అధినేతను ఒక్క సీటే అడిగామని, రెండు అడగలేదని, తమకు టిక్కెట్ ఇవ్వకుంటే స్వతంత్ర్యంగా వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
Recommended Video
కూతురు కోసం పట్టు: 12న కాంగ్రెస్లోకి కొండా సురేఖ! అందుకే కేసీఆర్ తీవ్ర అగ్రహం
తాను, తన భర్త కొండా మురళి, తన కూతురు సుష్మితలు పోటీ చేస్తారని తెలిపారు. తెరాస టిక్కెట్ ఇవ్వకపోవడం, కాంగ్రెస్ నుంచి రెండు టిక్కెట్ల హామీ లభించడంతో ఆమె ఆ పార్టీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారని అంటున్నారు. కొండా సురేఖ పార్టీని వీడితో వరంగల్లో పలువురు కార్పోరేటర్లు, ఇతర నేతలు కూడా ఆమె వెంట నడిచే అవకాశాలున్నాయి. దీంతో జిల్లా నేతలు రంగంలోకి దిగారు.
కూతురు రాజకీయ రంగ ప్రవేశానికి
కొండా సురేఖ కూతురు సుస్మిత రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం చేశారు. గత ఒకటి రెండేళ్లుగా కొండా దంపతులు కూతురు పేరును తెరపైకి తెస్తున్నారు. తాము రెండు సీట్లు అడుగుతామని సురేఖ మొదటి నుంచి చెబుతున్నారు. వరంగల్ తూర్పుతో పాటు భూపాలపల్లి, పరకాలలో ఒకటి అడుగుతున్నారు. కానీ తనకు అసలే సీటు కేటాయించకపోయేసరికి కొండా సురేఖ తెరాసపై తిరుగుబావుటా ఎగురవేశారు. కాంగ్రెస్ వారికి రెండు సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది.
కొండా దంపతులపై నన్నపనేని నరేందర్ ఆగ్రహం
తెరాసపై విమర్శలు చేసిన కొండా దంపతులపై వరంగల్ నగర మేయర్ నన్నపనేని నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కొండా దంపతులను రాజకీయంగా తొక్కేస్తే, కేసీఆర్ వారికి ఆశ్రయం ఇచ్చి రాజకీయ భిక్ష పెడితే విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే సత్తా ఉందన్న కొండా దంపతులు తాము కోరుకుంటున్న మూడుచోట్ల పోటీ చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ జన్మనిస్తే టీఆర్ఎస్ వారికి పునర్జన్మను ఇచ్చిందన్నారు. ఈ విషయాన్ని వారు కూడా చెప్పారన్నారు.
అప్పటి నుంచే కేసీఆర్ వారి ద్రోహాన్ని పసిగట్టారు
కొండా దంపతులు తనను కలిసినట్లు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ప్రకటించినప్పటి నుంచే తెరాసకు చేస్తున్న ద్రోహాన్ని కేసీఆర్ పసిగట్టారని నరేందర్ తెలిపారు. గొడవలు సృష్టించేందుకు మీనార్ పేరుతో గొడవలు సృష్టించారని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉంటూ రోడ్డుపై ఎలా కూర్చుంటారన్నారు. వారి ఓట్ల రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
సొంత నియోజకవర్గం కాదని...
కొండా దంపతులు వరంగల్ తూర్పు అభివృద్ధిని పక్కన పెట్టి ఇతర నియోకవర్గాల వైపు చూశారని నన్నపనేని మండిపడ్డారు. వరంగల్ తూర్పులో టీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో 2014లో 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారని, కానీ వారిని పట్టించుకోలేదన్నారు. ప్రజలతో కాళ్లు మొక్కించుకునే సంస్కృతి ఎక్కడిదన్నారు.