'మరో శతాబ్దికి సరిపడా బొగ్గు, వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు, ఓపెన్తో లాభం'
సింగరేణిలో మరో శతాబ్ధానికి సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీలో చెప్పారు.
హైదరాబాద్: సింగరేణిలో మరో శతాబ్ధానికి సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీలో చెప్పారు. అలాగే, తాము ఇచ్చిన మాట ప్రకారం వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించామన్నారు. ఆయన అసెంబ్లీలో గురువారం మాట్లాడారు.
సింగరేణి దేశానికి తలమానికం అన్నారు. ఇది ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. సింగరేణిలో మరో శతాబ్దికి సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. సింగరేణి బొగ్గుతో ఏపీ, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ థర్మల్ విద్యుత్ అవసరాలు తీరుతున్నాయని చెప్పారు.
కేసీఆర్! అపవాదు రాకుండా చూసుకోండి, రనౌట్ అయ్యా: మాజీ సీఎస్ సంచలనం
సింగరేణి నుంచి ఇప్పటి వరకు 1249 టన్నుల బొగ్గును వెలికి తీశారని చెప్పారు. సింగరేణిలో 46 గనులు ఉన్నాయన్నారు. 30 భూగర్భ గనులు, 14 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయన్నారు. సింగరేణిలో 56,866 మంది ఉద్యోగులు ఉన్నారన్నారు.
భూగర్భ గనుల ద్వారా ఆర్థికంగా నష్టం వస్తుందని, ఓపెన్ కాస్ట్ ద్వారా లాభం వస్తుందని చెప్పారు. లాభాలు తెచ్చిపెడుతున్న ఓపెన్ కాస్ట్ లేకుంటే కష్టమన్నారు. నష్టం వస్తున్నప్పటికీ కార్మికుల కోసం భూగర్భ గనులు కొనసాగిస్తున్నామన్నారు.
లాభాలను దృష్టిలో పెట్టుకొని ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉత్పత్తి కొనసాగిస్తోందన్నారు. భూగర్భ గనుల్లో 34,764 మంది పని చేస్తున్నారన్నారు. ఓపెన్ కాస్ట్లో 10,427 మంది పని చేస్తున్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర అమోఘమన్నారు. 2009 నుంచి 2014 వరకు సగటున వృద్ధి రేటు మూడు శాతంగా ఉందన్నారు.
డిపెండెంట్ ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణ
జనవరి 1వ తేదీ నుంచి డిపెండెంట్ ఉద్యోగాల దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించామన్నారు.
గత ప్రభుత్వం కార్మికులు చనిపోతే రూ.7 లక్షలు మాత్రమే ఇచ్చేదని, తాము రూ.25 లక్షలు ఇస్తున్నామన్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి 400 గ్రాముల బరువు ఉండే హెల్మెట్ ఇస్తున్నామన్నారు.