రేపే తిరుపతికి కేసీఆర్: షెడ్యూల్ వివరాలు ఇవే..
గతంలో మొక్కుకున్న ప్రకారం 5.59 కోట్ల విలువైన సాలగ్రామ హారం, కంఠాభరణాలను వేంకటేశ్వరస్వామి వారికి ఈ సందర్బంగా కేసీఆర్ సమర్పించనున్నారు.
హైదరాబాద్: వెంకన్న దర్శనం నిమిత్తం తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు 21న ఆయన తిరుపతి పర్యటన ఖరారైంది. మంగళవారం మధ్యాహ్నాం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులతో కలిసి ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట విమానశ్రయం చేరుకుంటారు.
అనంతరం తిరుమల కొండ మీదకు చేరుకుని, ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు తెల్లవారుజామునే స్వామి వారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. గతంలో మొక్కుకున్న ప్రకారం 5.59 కోట్ల విలువైన సాలగ్రామ హారం, కంఠాభరణాలను వేంకటేశ్వరస్వామి వారికి ఈ సందర్బంగా కేసీఆర్ సమర్పించనున్నారు.

వెంకన్న దర్శనం తర్వాత పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారికి ముక్కుపుడక సమర్పించుకుంటారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ పయనమవుతారు.
కేసీఆర్ తిరుపతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించడానికి ఐఏఎస్ అధికారి రమణాచారి ఈరోజు తిరుమల వెళ్లనున్నారు. గతంలో ఆయన టీటీడీ కార్యనిర్వాహక అధికారిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ రమణాచారి వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్ కూడా తిరుమల వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.
కాగా, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాకారం కావాలని ఆకాంక్షిస్తూ పలువురు దేవుళ్లకు కేసీఆర్ మొక్కుకున్నారు. రాష్ట్రం ఏర్పడటం.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసీఆర్ తన మొక్కులను చెల్లిస్తూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications