భరత్తో ఎనిమిది నెలలుగా టచ్లో..: దేవి మృతిపై తేల్చేసిన పోలీసులు
హైదరాబాద్: బిటెక్ విద్యార్థిని దేవి మృతిపై పోలీసులు తేల్చేశారు. ఆమె రోడ్డు ప్రమాదంలోనే చనిపోయిందని గుర్తించినట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కుంటున్న భరత్ సింహా రెడ్డి ఫోన్ కాల్ డేటాను, దేవి ఫోన్ కాల్ డేటా, వాట్సప్ ఫోటోలు, మెసేజ్లను పోలీసులు విశ్లేషించారు.
దేవి మృతిపై ఆమె తల్లిదండ్రులు లేవనెత్తిన సందేహాలను పోలీసులు ఫోరెన్సిక్ బృందానికి ప్రశ్నావళి రూపంలో అందించారు. ప్రమాదం వల్లనే అటువంటి గాయాలవుతాయని ఫోరెన్సిక్ నిపుణులు కూడా తేల్చారు. దీంతో దాదాపుగా దేవి మృతిపై వ్యక్తమవుతున్న సందేహాలు నివృత్తి అయినట్లుగా భావిస్తున్నారు.
భరత్ సింహారెడ్డితో గత ఏడాది కాలంగా 1500 మంది వివిధ సందర్భాల్లో టచ్లో ఉన్నట్లు పోలీసులు కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. ప్రమాదానికి ముందు, తర్వాత ఆ 1500 మంది సెల్ఫోన్ టవర్ లోకేషన్స్ను పరిశీలించారు. వారెవరూ ఆ ప్రాంతంలో లేరని పోలీసులు గుర్తించారు.
ఫేస్ బుక్ ద్వారా భరత్ సింహారెడ్డికి, దేవికి మధ్య పరిచయం ఏర్పడిందని, వారిద్దరు గత 8 నెలలుగా టచ్లో ఉన్నారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన రోజు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్లోని పబ్ నుంచి తెల్లవారు జామున 3.33 గంటలకు బయలుదేరిన దేవి, భరత్ సింహా రెడ్డిల స్నేహితులు వెంకట్, పృథ్వీ, విశ్వనాథ్లతో పాటు సొనాలి అనే అమ్మాయి సెల్ఫోన్ టవర్ లోకేషన్స్ సైతం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు.
పబ్ నుంచి భరత్ సింహా రెడ్డి కారు 11 నిమిషాల్లోనే జర్నలిస్టు కాలనీకి చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ పత్రికా కార్యాలయం సిసిటీవీ ఫుటేజీలలో ఆ కారు 3.44 గంటలకు దూసుకుపోతున్నట్లు కనిపించింది. దేవి తన తండ్రితో ఫోన్ మాట్లాడేందుకు కొద్ది దూరంలోనే ఐదు నిమిషాల పాటు కారు నిలిపి ఉన్నట్లు కూడా టవర్ సిగ్నల్ ఆధారంగా తేలినట్లు చెబుతున్నారు.
అప్పటికే ఇంటి నుంచి ఫోన్లు వస్తుండడంతో భరత్ కారు వేదాన్ని మరింత పెంచే ప్రయత్నంలో నియంత్రణ తప్పి చెట్టుకు ఢీకొట్టాడని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దేవి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్, మోటారు వాహనాల నిపుణులతో కలిసి పోలీసులు చేసిన రెండవ విచారణలో దేవిది హత్య అని చెప్పేందుకు ఏ విధమైన ఆధారాలు లభించలేదని సమాచారం.