తుంగభద్ర పుష్కరాలు : కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ఉంటేనే ఘాట్లోకి అనుమతి...
ఈ నెల 20 నుంచి తెలంగాణలో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ పరిధిలో ఉన్న నాలుగు పుష్కర ఘాట్లలో పుష్కరాలు నిర్వహించనున్నారు.ఈ సారి కోవిడ్ 19 నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు,నిబంధనల నడుమ పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు 12 రోజుల పాటు ప్రతీరోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్కరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పదేళ్ల లోపు పిల్లలు, గర్భిణీలు, 65 ఏళ్లు పైబడినవారు పుష్కరాలకు రాకూడదని సూచించింది.కరోనా నెగిటివ్ రిపోర్టుతో వస్తేనే పుష్కరఘాట్లలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. టెస్టు రిపోర్టు లేకుండా వచ్చేవారికి థర్మల్ స్క్రీనింగ్ అనంతరం అనుమతి ఉంటుందని తెలిపింది. ఒకవేళ కరోనా లక్షణాలు ఉంటే పుష్కర ఘాట్ల వద్దకు అనుమతి ఉండదన్నారు.పుష్కరఘాట్లు, ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు మాస్కులు ధరించడం, ఆరడుగుల భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.2.5 కోట్లు విడుదల చేసింది.ఈ నిధులతో పుష్కర ఘాట్ల వద్ద మౌలిక వసతులతోపాటు, అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. సోమవారం(నవంబర్ 16) హైదరాబాద్లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏర్పాట్లపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని... అదే సమయంలో నాణ్యత లోపించకూడదని చెప్పారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నది ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పుష్కర ఘాట్ల వద్ద కంచె ఏర్పాటు చేయాలన్నారు. గజ ఈతగాళ్లను, రెస్క్యూ బోట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications