తెలంగాణ ఏమిచ్చింది..: ధూంధాం కళాకారుడి ఆత్మహత్య
తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఉత్తేజపరిచిన గొంతుక మూగబోయింది. జీవితంలో వెలుగు కరువై బొల్లం మధు అనే గాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
వరంగల్: తెలంగాణ ఉద్యమ గొంతుక ఒకటి మూగబోయింది. తెలంగాణ ఉద్యమ కాలంలో ధూంధామ్ కార్యక్రమాల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచిన గాయకుడు బలవన్మరణానికి గురయ్యాడదు. ఉద్యోగం, ఉపాధి లేకపోవడంతో వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తిహవేలీ గ్రామానికి చెందిన బొల్లం మధు (26) ఆత్మహత్య చేసుకున్నాడు.
బొల్లం మధు హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదివాడు. విద్యార్థి దశ నుంచే ఉద్యమ పాటలు రాయడం, పాడడం ప్రారంభించాడు. కళాశాలలో చదువుతున్న క్రమంలోనే విద్యార్థి జెఎసిలో కీలకంగా పనిచేశాడు. తెలంాణ ధూంధాం కళాకారుల బృందంలో కూడా పనిచేస్తూ వచ్చాడు.
మధు తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించాడు. తల్లి బొల్లం కనకలక్ష్మి, ఇద్దరు అన్నదమ్ములు, చెల్లెళ్లు ఉన్నారు. గతంలోనే వారి పెళ్లిళ్లు జరిగాయి. తల్లితో పాటు అన్నదమ్ముళ్లు కూలిపని చేస్తున్నారు. 2011లో డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో పాటు ఏ విధమైన ఉపాధి మార్గం లేకపోవడంతో గత కొంత కాలంగా మధు వేదనకు గురవుతూ వచ్చాడు.
జీవితంపై విరక్తి చెంది ఈ నెల 23వ తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వరంగల్ ఎంజిఎంలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించాడు.