భగ్గుమంటున్న పెట్రోల్, డీజీల్ ధరలు: తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పైపైకి, ఎందుకంటే?
హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కూడ అదే రీతిలో పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులతో కలుపుకొంటే వినియోగదారులపై తీవ్రమైన భారం పడుతోంది. దేశంలో తెలుగు రాష్ట్రాల్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇతర రాష్ట్రాలతో పోలీస్తే ఎక్కువగా ఉన్నాయి.
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే అదే సమయంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలియం ఉత్పత్తులపై వేసే పన్నులను తగ్గిస్తే వినయోగదారులకు కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే వ్యాట్, సేల్స్ ట్యాక్స్లను తగ్గించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి త ధర్మేంధ్రప్రధాన్ ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే లేఖలు రాశారు. మరో వైపు జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావాలనే యోచనలో కూడ కేంద్ర ప్రభుత్వం ఉంది. మరో వైపు ఇథనాల్ పాలసీని కూడ కేంద్రం ప్రకటించింది.ఈ విధానం అమల్లోకి వస్దే పెట్రోలియం ఉత్పత్తులు తగ్గే అవకాశం ఉందని కేంద్రం చెబుతోంది.
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుదల
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోజువారీ పెట్రోల్, డీజీల్ రేట్లను సవరించడం వల్ల ఇటీవల కాలంలో ఈ ధరలు విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్లో గతేడాది జూలై 16న రూ.67.11గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.75.47కు.. డీజిల్ ధర రూ.60.67 నుంచి రూ.67.23కు చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.92కు, డీజిల్ ధర రూ.68.79కు చేరాయి.
పన్నులతో వినియోగదారులపై మోత
పెట్రోల్, డీజీల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే అత్యధికంగా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర పడిపోయినా కానీ, ఈ పన్నులను మాత్రం ప్రభుత్వాలు తగ్గించడం లేదు.దీంతో అదే రేటుకు పెట్రోల్, డీజీల్ ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే ఈ పన్నుల భారం కలుపుకొంటే వినియోగదారులపై తీవ్రంగా భారం పడుతోంది.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ కింద ఒక్కో లీటర్ పెట్రోల్పై రూ.21.48, డీజిల్పై రూ.17.33 వసూలు చేస్తోంది. ఈ పన్ను తర్వాతి మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ పన్ను మోత మోగిస్తున్నాయి. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కలిపి పెట్రోల్పై 57 శాతం, డీజిల్పై 44 శాతం భారం పడుతున్నట్లు అంచనా
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలిలా
పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్, అదనపు సుంకాల విధింపులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై 38.82 శాతం వసూలు చేస్తున్నారు.డీజిల్పై పన్నుశాతం 30.71 వసూలు చేస్తున్నారు. తెలంగాణలో పెట్రోల్పై 35.20 శాతం, డీజిల్పై 27 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ రెండు రాష్ట్రాల్లో పన్నులు ఎక్కువగానే ఉన్నాయి.
జీఎస్టీలో చేర్చితే తగ్గే అవకాశం
జీఎస్టీలోకి పెట్రోల్, డీజీల్ ఉత్పత్తులను చేర్చితే ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా ఉన్న పెట్రోలియం ఉత్పత్తును జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే నష్టమనే అభిప్రాయంతో రాష్ట్రాలు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజీల్లను తీసుకురావాలని భావిస్తోంది.ఈ మేరకు రాష్ట్రాలతో సంప్రదింపులు జరపున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.