ఈడీ హైదరాబాద్ అదనపు డైరెక్టర్గా దినేష్ పరుచూరి నియామకం
హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హైదరాబాద్ అదనపు డైరెక్టర్గా ఐఆర్ఎస్ అధికారి దినేష్ పరుచూరి నియమితులయ్యారు. తెలంగాణ, ఏపీ పరిధితో కూడిన ఈడీ డైరెక్టరేట్ హైదరాబాద్ జోన్కు దినేష్ పరుచూరి నేతృత్వం వహిస్తారు.
ఐఆర్ఎస్ 2009 బ్యాచ్ అధికారి అయిన దినేష్.. జులై 31న డిప్యూటేషన్ పై ఈడీలో చేరారు. గతంలో ఆయన ఆదాయపుపన్ను శాఖ, ఏపీ ట్రాన్స్కోలో పనిచేశారు. ప్రస్తుత జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ ముంబై రెండో జోన్ జేడీగా బదిలీ అయ్యారు.
Recommended Video
పనాజీ, రాయ్పూర్ జోన్లకు కూడా గోయల్ ఇంఛార్జీగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ముంబై రెండో జోన్ జేడీగా ఉన్న యోగేశ్ శర్మ ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు. సుమారు మూడేళ్లుగా హైదరాబాద్ జేడీగా పనిచేసిన కర్ణాటక బ్యాచ్ ఐపీఎస్ అధికారి అభషేక్ గోయల్.. లోన్ యాప్లు, కార్వీ, ఈఎంఎస్, అగ్రిగోల్డ్, క్యాసినో, టాలీవుడ్ డ్రగ్స్ తదితర కీలక కేసుల దర్యాప్తులను పర్యవేక్షించారు.
గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఈడీ దాడుల గురించిన పరస్పర విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో దినేష్ పరుచూరి నియామకం చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్ఎస్ అవినీతిపై ఈడీ దాడులు తప్పవని, సీఎం కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు అంటున్న విషయం తెలిసిందే. అదే సమయంలో టీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీకి కౌంటర్లు ఇస్తున్నారు.