ప్రభుత్వానికెందుకింత వివక్ష..?కేవలం 5 ఆసుపత్రులకే నోటీసులా.?మిగతా వాటి సంగంతేంటన్న కాంగ్రెస్.!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్డగోలు బిల్లులతో అడ్డంగా దోచుకుంటున్న ప్రయివేటు ఆసుపత్రులపై అనేక ఫిర్యాదులు వస్తే కేవలం ఐదు ఆసుపత్రులకే నోటీసులెలా ఇస్తారని నిలదీస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ఉన్న ప్రయివేటు ఆసుపత్రుల మీద ఎందుకంత వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్ నిలదీస్తోంది. తమకు అనుకూలంగా ఉన్న ఆసుపత్రులను మినహాయించి ఏదో అనామక ఆసుపత్రులకు షోకాజ్ నోటీస్ ఇచ్చి కంటి తుడుపెు చర్యలు కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సూచిస్తోంది.
ప్రయివేట్ ఆసుపత్రుల అరాచకాలు ఆపండి.. ప్రభుత్వానికి కాంగ్రెస్ మరోసారి విజ్ఞప్తి..
ప్రయివేటు ఆసుపత్రుల పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, చేయని వైద్యం చేసినట్టుగా చూపించి లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కరోనా రెండో దశ చేస్తున్న విలయతాండవంతో అనేక మంది ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, ఆర్ధికంగి చితికి పోయిన వారికి ప్రయివేటు ఆసుపత్రులు భరించలేని బిల్లులు వేస్తున్నాయని మండిపతుతోంది కాంగ్రెస్. ఇలాంటి ఆసుపత్రుల మీద ఫిర్యాదులు వస్తే కేవలం ఐదు ఆసుపత్రులకు పోటీసులు ఇవ్వడం దారుణమని కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
88 ఆసుపత్రుల మీద ఫిర్యాదులు.. కేవలం 5ఆసుపత్రుల మీద చర్యలేంటన్న కాంగ్రెస్..
రాష్ట్ర ప్రభుత్వానికి అధిక బిల్లులు వసూల చేస్తున్న 88 ఆసుపత్రుల మీద ఆరోపణలు రాగా కేవలం 5 ప్రవేట్ ఆసుపత్రుల పై కోవిద్ చికిత్సలు చేయకుండా ఆంక్షలు విధించడం సిగ్గు చేటని కాంగ్రెస్ మండిపడుతోంది. ప్రవేట్ ఆసుపత్రులు కేవలం కరోన వ్యాధికి వైద్యం మాత్రమే కాకుండా అన్ని వైద్య సేవలకు మొదటి నుండి భారీగా చార్జీలు వసూలు చేస్తున్న సంగతి ప్రభుత్వానికి తెలియదా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. అన్ని వైద్య సేవలపై కూడా విచ్చల విడిగా అధిక బిల్లులు వేయకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పకడ్బందీగా ప్రణాళికతో ముందుకు రావాలని కాంగ్రెస్ హెచ్చరిస్తోంది.
ప్రభుత్వ జీవోను పట్టించుకోని మల్లారెడ్డి ఆసుపత్రి.. ఆరోగ్య శాఖకు ఫిర్యదు చేసిన ఎన్ఎస్యూఐ
ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకునే కరోనా బాధితుల వద్ద తీసుకోవాల్సిన చార్జీలపై తెలంగాణ ప్రభుత్వ జీవో ను బేఖాతరు చేస్తూ కరోనా బాధితుల వద్ద అక్రమంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న మల్లారెడ్డి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎన్ఎస్స్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నియమాలను తుంగలో తొక్కి, గౌరవ మంత్రి పదవిలో ఉండి ప్రజలకు మేలు చేయాల్సిన మంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కోవిడ్ పేషంట్ల వద్ద అధిక ఛార్జీలు.. మల్లారెడ్డి ఆసుపత్రి అడ్డగోలుగా దోచుకుంటుందన్న వెంకట్ బల్మూర్..
మల్లారెడ్డి తన సొంత మల్లారెడ్డి ఆసుపత్రుల్లో కరోనా బాధితుల వద్ద అధిక ఛార్జీలు వసూలు చేయడం సిగ్గు చేటని వెంకట్ ఆవేదన వ్యక్తం చేసారు. కరోనా కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి వారి ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న మంత్రి మల్లారెడ్డి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎంసీఐ ఛైర్మెన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి.. అదే విధంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన సెక్రెటరీలకు ఈమెయిల్ ద్వారా పిర్యాదు చేయడం జరిగిందని వెంకట్ తెలిపారు. కనీసం ఈ విషయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ వెంటనే చర్యలు తీసుకోవాలని వెంకట్ డిమాండ్ చేసారు.