కోటి ఎకరాలకు మాగాణం: ఆచరణలో ఆటంకాలు
తెలంగాణలో ప్రాజెక్టుల నిర్వాసితుల గోడు చెప్పనలవికాదు. గులాబీ కండువా కప్పుకున్న వారికే అధిక పరిహారం చెల్లిస్తున్న వైనం అధికార టీఆర్ఎస్ నేతల బెదిరింపుల తీరును తెలియజేస్తున్నది.
హైదరాబాద్: తెలంగాణలో కోటి ఎకరాలను మాగాణం చేస్తానని ఘంటాపథంగా చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆచరణలో పలు ఆటంకాలు కల్పిస్తున్నది. ఆయా ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించే భూముల యజమానులకు పరిహారం చెల్లింపుల్లో రాజకీయాలు చేస్తున్నదని, వివక్ష చూపుతున్నదన్న విమర్శలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరకు పత్రికా యాజమాన్యాల వైఖరికి అనుగుణంగా వార్తలు రాసే విలేకరులపైనా దాని ప్రభావం పడింది. దానికి తాజా తార్కాణమే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద వనపర్తి జిల్లాలో చేపట్టిన ఏదుల రిజర్వాయర్ కింద నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అధికారులు మాత్రం చేపట్టాల్సిన ప్రక్రియలో అధికార టీఆర్ఎస్ నేతలు జోక్యం చేసుకోవడం వాస్తవ పరిస్థితులను పట్టిస్తున్నది.
'నీవు ఏ పార్టీలో పని చేస్తున్నావు. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటేనే అధిక పరిహారం ఇచ్చేది. రోజూ ప్రభుత్వాన్ని విమర్శిస్తే, అనుకూలమైన ధర అంటే ఎలా' ఇదీ నిర్వాసితులకు రాజకీయ నాయకుల బెదిరింపు. 'మీరు ఏ పత్రికలో పని చేస్తున్నారు. మీరు ఫలానా పత్రికలో పని చేస్తున్నారు.. మీకు పరిహారం అధికంగా ఇవ్వం. ఇవ్వాలని ఎలా అడుగుతారు.. మీరు మరో పత్రికలో పని చేయండి.. ఎక్కువ పరిహారం ఇస్తాం' ఇదీ ఒక విలేకరికి అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల అదలింపు.
రైతుల మధ్య చిచ్చు పెట్టేలా అధికార పార్టీ నేతల తీరు
ఏదుల రిజర్వాయర్ ముంపువాసుల గోడు వర్ణనాతీతం. రైతుల్లోనూ చిచ్చు పెట్టేందుకు గులాబీ కండువా కప్పుకుంటేనే ఎక్కువ పరిహారం ఇస్తామని బహిరంగంగా చెప్తున్నారు. ఇవన్నీ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వనపర్తి జిల్లాలో నిర్మాణం చేపట్టిన ఏదుల రిజర్వాయర్ నిర్వాసితులతో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు, అధికార యంత్రాంగం చెప్తున్న కబుర్లు. ఏదుల రిజర్వాయర్ కింద బండరాయిపాకులలో 1,475 ఎకరాలు, కొంకులపల్లిలో 850, తీగలపల్లిలో 920, రేవల్లిలో 250, నాగాపూర్లో 216, ఎన్నచర్లలో 56 ఎకరాలతో కలిపి మొత్తం 3100 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి.
రెండు పంటలు పండే భూములకు రూ.3.50 లక్షలే
బండరాయిపాకుల గ్రామంలో గుట్టమీద పూర్వకంటి రాములు, సైదులు, గడ్డిగోపుల కుర్మయ్య, రంగమ్మ, కళ్యాణం చెంద్రమ్మ, శేషమ్మ, దెండి శేఖర్రెడ్డి భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ ఎత్తుభాగాన ఉంటాయి. ఏడాదికి ఒక పంట మాత్రమే సాగు చేస్తారు. అయినా వారికి కొందరు రాజకీయ నాయకుల జోక్యంతో రూ.5.50 లక్షల పరిహారం చెల్లించారు. అదే కాల్వ, చెరువు కింద నీరు పారి ఏడాదికి రెండు పంటలు సాగయ్యే భూములకు ఎకరాకు రూ.3.50 లక్షలు మాత్రమే చెల్లించారు. ఇదేమిటని అడిగితే 'మీరూ గులాబీ కండువా కప్పుకోండి.. మీకూ అంతే పరిహారం వచ్చే విధంగా చూస్తామని'' కొందరు రాజకీయ నాయకులు, అధికారులు చెబుతున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవల్లికి చెందిన కిరణ్ నవతెలంగాణలో విలేకరిగా పని చేస్తున్నాడు. ఆయన భూమి కూడా ముంపు కింద పోయింది. పరిహారం చెల్లించాలని అడిగితే 'నీవు నవతెలంగాణ దినపత్రికలో పని చేస్తావు కదా.. నీకు అధిక పరిహారం ఎలా ఇస్తాం.. వేరే పత్రికలో చేరు.. అప్పుడు అధిక పరిహారం ఇప్పిస్తాం' అని రాజకీయ నాయకులు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఆ విలేకరి నెల రోజుల కిందట రాజీనామా చేశాడు.
అరకొర పరిహారంతోనే సరి
ఏదుల రిజర్వాయరులో ముంపునకు గురవుతున్న రాములు, ఉత్తస్వామి, కృష్ణయ్య, బంగారయ్య, రాజు, నర్సింహా, రాములు, మిద్దె కృష్ణయ్య భూములు ఎకరాకు రూ. 3.50 లక్షలే ఇచ్చారు. రేవల్లి మండలం రాయిపాకుల గ్రామం రిజర్వాయరులో పూర్తిగా మునిగిపోతుంది. మరో ఆర్నెళ్లయితే రిజర్వాయర్ పనులు పూర్తయితే నీటిని కూడా వదిలే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ భూములకు అరకొర పరిహారమే చెల్లించారు. ఇప్పుడు ఇండ్లు ఖాళీ చేయాలని అధికారులు చెప్తున్నారు. కానీ అధికారులు పూర్తి పరిహారం ఊసే ఎత్తడం లేదు. ఈ గ్రామంలో 650 ఇండ్లు ఉంటాయి. 2500 జనాభా ఉంటుంది. ఇక్కడ వరి, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలు అధికంగా సాగువుతాయి. ఇప్పుడు ఏదుల రిజర్వాయర్ నిర్మాణంతో గ్రామాన్ని వదలివెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిహారం చెల్లింపులో టీఆర్ఎస్ నాయకుల జోక్యం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిర్మిస్తున్న ప్రతి ప్రాజెక్టు విషయంలోనూ అధికార టీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వినవస్తున్నాయి. వట్టెం దగ్గర ఉన్న రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న వారి పట్లా వివక్ష చూపుతున్నారు. పట్టేళ్లు, భూస్వాములు, రాజకీయ నాయకులకు ఒక ధర, సామాన్య రైతులకు మరో ధర చెల్లించారనే విమర్శలూ ఉన్నాయి. బూత్పూరు మండలం కర్వేనా దగ్గర నిర్మిస్తున్న కురుమూర్తి రాయ రిజర్వాయర్ ముంపు బాధితులకు సైతం పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళన చేస్తే పోలీసుల రంగ ప్రవేశం
ప్రాజెక్టుల కింద నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విధానం పారదర్శకంగా ఉండాలని ఇతర పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వట్టెం రాజర్వాయరులో కొంత మంది భూస్వాములకు అధికంగా ఇస్తూ పేదల పొట్టకొడుతున్నారు. ఈ విషయమై ఆందోళన చేస్తే పోలీసుల సాయంతో అణచివేస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అందరికీ పరిహారం పారదర్శకంగా అందేలా చూడాలని సీపీఎం నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు అన్నారు. ‘మా భూములు తీసుకుంటున్నారు. కానీ ఎంత పరిహారం ఇస్తున్నారో చెప్పడం లేదు. పరిహారం చెక్కులు ఇస్తేనే ఎకరాకు ఎంత ఇస్తున్నారో తెలుస్తుంది. మాకు ఏ సమాచారం చెప్పడం లేదు. కొందరిని ఇంటికి పిలిచి ఏవో ఒప్పందాలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు అధికంగా పరిహారం కావాలని అడిగిన బాధితులు ఇప్పుడు నాయకులు రాగానే మిన్నకుంటున్నారు' అని అంబేద్కర్ సంఘం నాయకులు రాములు తెలిపారు.