ఎన్ ఆర్ ఐకు కోర్టు ఝలక్: బిడ్డ సంరక్షణ,భార్య ఆస్తుల పంపకం తేలాకే విడాకులు
భారత్ లో ఉంటున్న బిడ్డ సంరక్షణ, భార్యతో ఉన్న ఆస్తుల పంపకం వివాదాలు తేలకుండా అమెరికాలో కేసును కొనసాగించకూడదని ఓ ఎన్ ఆర్ ఐని హైద్రాబాద్ నగర కుటుంబ న్యాయస్థానం ఆదేశించింది.
హైదరాబాద్: భారత్ లో ఉంటున్న బిడ్డ సంరక్షణ, భార్యతో ఉన్న ఆస్తుల పంపకం వివాదాలు తేలకుండా అమెరికాలో కేసును కొనసాగించకూడదని ఓ ఎన్ ఆర్ ఐని హైద్రాబాద్ నగర కుటుంబ న్యాయస్థానం ఆదేశించింది.
ఈ నెల 31వ, తేది వరకు విడాకుల కేసు విచారణను ఆపాలంటూ న్యాయమూర్తి తిరుపతయ్య సదరు ఎన్ ఆర్ ఐ ను ఆదేశిస్తూ ఇటీవల మద్యంతర ఉత్తర్వులిచ్చారు. అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతో పాటు భార్య, పిల్లలను భారత్ కు పంపించి అమెరికా న్యాయస్థానం ద్వారా విడాకులు పొందాలని ప్రయత్నించారు ఎన్ ఆర్ ఐ కొమ్మినేని సిద్దిజ్ఘానేశ్వర ప్రసాద్ కు ఇక్కడి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ప్రతిబంధకంగా మారాయి.
ఇండియాలోని కేసులు సివిల్ వివాదాలు తేలకుండా అమెరికాలో తన భర్త ప్రసాద్ వేసిన విడాకుల కేసు విచారించకుండా ఆదేశించాలని కోరుతూ సోని ఓలేటి కొమ్మినేనిన అనే మహిళ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
హిందూ సంప్రదాయం ప్రకారం భారత్ లో పెళ్ళైందని ఇక్కడి క్రిమినల్, సివిల్ వివాదాలు పెండింగ్ లో ఉండగా ఏకపక్షంగా అమెరికాలో విడాకుల కేసు కొనసాగితే సోనికి అన్యాయం జరుగుతోందని ఆమె తరపు న్యాయవాది బాలాజీ కోర్టును కోరారు.
2013 డిసెంబర్ 6న, తిరుపతిలో సోనిని ప్రసాద్ వివాహం చేసుకొన్నాడు. అనంతరం కోటి రూపాయాల కట్నం తేవాలంటు వేధింపులకు గురిచేశారని న్యాయవాది చెప్పారు.అమెరికా వెళ్ళేందుకు విమాన ఖర్చుల కోసం రూ.3 లక్షలు తీసుకొని సోనిని అమెరికా తీసుకెళ్ళారని న్యాయవాది వివరించారు.
అమెరికాలో ఉన్న సమయంలో ఓ దఫా హత్యాయత్నంతో పాటు కాన్పు ఖర్చును కూడ పుట్టింటి నుండి తేవాలని వేధించేవారని కోర్టులో సోని తరపు న్యాయవాది వివరించారు. 2015 నవంబర్ 15న, నెలల బాబుతో భార్యను భారత్ లో వదిలి అమెరికాలోని టెక్సాస్ డెన్ టౌన్ కౌంటీ జిల్లా కోర్టులో విడాకుల కేసు విచారించకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారని వివరించారు.
అయితే ఈ వివాదాలను పరిష్కరించే పరిధి తమకు లేదని, విడాకుల కేసును మాత్రమే విచారించే అధికారం తమకుందని అక్కడి కోర్టు స్పష్టం చేసింది. అక్కడి విడాకుల కేసులో ముందుకు వెళ్ళకుండా ప్రసాద్ ను ఆదేశించాలని కోరుతూ సోని కుటుంబ కోర్టును ఆశ్రయించింది.