అరుణమ్మ ఆగ్రహం..! బీజేపి జోలికొస్తే దంచుడే అని తెలంగాణ మంత్రులకు జేజెమ్మ హెచ్చరిక..!!
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ కాస్త విరామం తర్వాత మళ్లీ రాజకీయ తెరపైకి వచ్చారు. కరోనా కష్ట కాలంలో ప్రభుత్వ పని తీరు, రైతులు పండించిన ధాన్యం కొనుగోలు, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వ అలసత్వం వంటి అంశాలపై జేజెమ్మ తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకు పడింది.
అంతే కాకుండా బీజేపి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీఆర్ఎస్ మంత్రులకు హెచ్చరికలు జారీ చేసారు డీకె అరుణ. సోమవారం ఉదయం బిజెపి ప్రధాన కార్యాలయంలో డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, ధాన్యం సేకరణలో ఇబ్బందులను ఆమె ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులంతా బిజెపి నేతలను సంప్రదిస్తూ కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారని అరుణ వివరించారు.
అంతే కాకుండా కరోనా వైరస్ వ్యాప్తి, అకాల వర్షాలు, ధాన్యం సేకరణ వంటి అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకు బిజెపి నేతలపై ఎదురు దాడికి దిగితే సహించేది లేదని టీఆర్ఎస్ మంత్రులను ఆమె హెచ్చరించారు. బిజెపి రాజకీయం చేయదలుచుకుంటే టీఆర్ఎస్ మంత్రులు ఒక్కరు కూడా బయట తిరగలేని పరిస్థితులు నెలకొంటాయని అరుణ మండిపడ్డారు.
Recommended Video
కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నా కూడా టిఆర్ఎస్ నేతలు బిజెపిపై రాజకీయ విమర్శలకు దిగడం సరికాదని అరుణ వ్యాఖ్యానించారు ముందు రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని ఆమె హితవు పలికారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. రైతుల నుంచి చివరి ధాన్యం గింజ వరకు కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట తప్పారని అరుణ ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు లెక్కలను మంత్రులు చెప్పగలరా అని ఆమె సవాల్ విసిరారు.