డెబిట్, క్రెడిట్ కార్డుల పిన్ ఎవరికీ చెప్పొద్దు: పోలీసులు
హైదరాబాద్: ఏ బ్యాంకు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నుంచైనా ఫోన్ కాల్ వచ్చి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు పిన్ నెంబర్ అడిగితే చెప్పకూడదని, ఆ వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని హైదరాబాద్ పోలీసులకు ప్రజలకు సూచించారు. కొందరు దుండగులు బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసి వినియోగదారుల నుంచి పిన్ నెంబర్, ఆన్లైన్ వన్టైమ్ పాస్వర్డ్ వివరాలను(ఓటిపి) సేకరించి వారి ఖాతాలో ఉన్న నగదును కాజేస్తున్నారని తెలిపారు.
డెబిట్ కార్డు వివరాలను అప్డేట్ చేయాలంటూ వారు ఫోన్ చేసి అడుగుతారని, అవి నమ్మకూడదని తెలిపారు. ఇలాంటి కేసులు గత సంవత్సరం 100కుపైగా నమోదయ్యాయయని చెప్పారు. ఇలా మోసపోయిన వారిలో ఓ ప్రముఖ పత్రిక సీనియర్ జర్నలిస్టు కూడా ఉన్నారని తెలిపారు. అతను తన కార్యాలయానికి డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతున్న సమయంలో ఓ ఫోన్ వచ్చింది.
డెబిట్ కార్డు నెంబర్, కార్డుపై పేరు, పిన్, ఓటిపి వివరాలను ఫోన్ చేసిన వ్యక్తి అడిగాడు. దీంతో నమ్మిన ఆ జర్నలిస్టు తన డెబిట్ కార్డు వివరాలను ఫోన్ చేసిన వ్యక్తికి తెలిపాడు. వివిధ వెబ్సైట్ల నుంచి వస్తువులను తన కార్డుల నుంచి కొనుగోలు చేసినట్లుగా ఫోన్కు సందేశాలు రావడం మొదలయ్యాయి. దీంతో వెంటనే అతను బ్యాంకు అధికారులను సంప్రదించారు.
అయితే బ్యాంకు అధికారులు తాము ఎలాంటి సమాచారం మీ నుంచి కోరలేదని అతనికి చెప్పడంతో షాక్కు గురయ్యాడు. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులను సంప్రదించారు. ఈ కేసును దర్యాప్తు జరిపిన సిసిఎస్ సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ విపి తివారీ ఈ వివరాలను తెలిపారు.
బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేయడం ద్వారా దుండగులు ఖాతాదారులకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి మోసగాళ్ల వలలో పడకూడదని హెచ్చరించారు.