పాత నోట్లా, కొత్త నోట్లే చెల్లించాలా?: జడ్జీతో జంటపేలుళ్ల దోషుల దుస్సాహసం
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులైన ఉగ్రవాదులు.. కోర్టులో దుస్సాహసానికి పాల్పడ్డారు.
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులైన ఉగ్రవాదులు.. కోర్టులో దుస్సాహసానికి పాల్పడ్డారు. తమకు విధించిన జరిమానాను రద్దయిన నోట్లతో చెల్లించాలా? లేక కొత్త నోట్లే చెల్లించాలా? అంటూ పేలుళ్ల కేసులో దోషులైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు యాసిన్ భత్కల్ తోపాటు ఇతర ఉగ్రవాదులు.. న్యాయమూర్తిని అడిగారు.
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు పాల్పడిన కేసులో యాసిన్, జియా ఉర్ రెహమాన్ అలియాస్ వకాస్, అసదుల్లా అక్తర్, అజజ్ షేక్, తహసీన్ అక్తర్లకు సోమవారం ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. కాగా, నిందితులు పాల్పడ్డ చర్య చాలా తీవ్రమైనదని కోర్టు తీర్పు సమయంలో అభిప్రాయపడింది.
సోమవారం కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో 'మీరేమైనా చెప్పదల్చుకున్నారా?' అని దోషులను కోర్టు ప్రశ్నించింది. దీనికి 'మమ్మల్ని ఉరి తీయండి' అంటూ ఆ ఉగ్ర నిందితులు బదులిచ్చారు. కాగా, న్యాయమూర్తి.. పేలుళ్ల దోషులు ఐదుగురికి కూడా ఉరిశిక్షతోపాటు రూ. 4000ల జరిమానా విధించారు.
ఈ సందర్భంగా 'జరిమానా విధించిన మొత్తాన్ని రద్దయిన కరెన్సీ చెల్లించాలా? లేక కొత్త నోట్లా?' అని యాసిన్ భక్తల్, ఇతర దోషులు న్యాయమూర్తిని ప్రశ్నించారు. కాగా, రియాజ్ భక్తల్ తోపాటు ఈ ఐదుగురు ఫిబ్రవరి 21, 2013లో దిల్సుఖ్నగర్లో జంట పేలుళ్లకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో 19మంది మరణించగా, 131మందికిపైగా గాయాలయ్యాయి. కాగా, రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. అతను పాకిస్థాన్లో ఉన్నట్లుగా ఎన్ఐఏ అనుమానిస్తోంది.