ఈ డాక్టర్కు చేతులెత్తి మొక్కాల్సిందే... కరోనా పేషెంట్కు స్వయంగా అంత్యక్రియలు
కరోనా పరిస్థితుల నేపథ్యంలో సమాజంలో అభద్రతా భావం,ఆందోళన నెలకొన్నాయి. కరోనా వైరస్కు భయపడి కొన్నిచోట్ల అధికారులు విధులు నిర్వర్తించేందుకు కూడా జంకుతున్న పరిస్థితి. కొన్నిచోట్ల కుటుంబ సభ్యులు కూడా మృతదేహాలను తీసుకెళ్లేందుకు నిరాకరిస్తుండటంతో... ఎంతోమంది కరోనా మృతుల అంత్యక్రియలకు దిక్కూ మొక్కూ లేకుండా అవుతోంది.
తాజాగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో ఓ కరోనా పేషెంట్ మృతి చెందగా... అంత్యక్రియలు నిర్వహించాల్సిన మున్సిపల్ సిబ్బంది అందుబాటులో లేకుండా పోయారు. ఆస్పత్రి సిబ్బంది ఎన్నిసార్లు వారికి ఫోన్ చేసినా స్పందన కరువైంది. మరోవైపు ఐసోలేషన్ వార్డు నుంచి మృతదేహాన్ని తరలించాలని పేషెంట్లు పట్టుబట్టారు. దీంతో కరోనా నియంత్రణ కోసం నియమించిన జిల్లా ప్రత్యేక వైద్యాధికారి శ్రీరామ్ మానవీయ దృక్పథంతో స్పందించి ఆయనే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు.
ఆస్పత్రి సిబ్బంది సాయంతో మున్సిపల్ వాహనంలో మృతదేహాన్ని ఎక్కించారు. అక్కడినుంచి తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ శ్మశానానికి తరలించారు. అక్కడ దహన సంస్కారాలు పూర్తి చేసి వచ్చారు. వైద్యుడు శ్రీరామ్ స్పందన పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
పెద్దపల్లిలో ఆదివారం(జూలై 12) ఒక్కరోజే 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం నుంచి వచ్చే 10 రోజుల పాటు అక్కడ స్వచ్చంద లాక్ డౌన్ పాటిస్తున్నారు.నిత్యావసర సరుకులు,కూరగాయల వ్యాపారంతో పాటుగా ప్రస్తుతం నాట్ల సీజన్ కావడంతో రైతులకు ఇబ్బంది కలగకుండా ఎరువుల దుకాణాలకు కూడా ఈ లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇచ్చారు.
#Telangana- From a stethoscope to a steering wheel. Doctor Sreeram working at Sultanabad Goverment Hospital, Peddapalli district drove a tractor carrying body of a #Covid_19 deceased after municipal staff refused to take the body to the crematorium. #Hyderabad pic.twitter.com/tDJCt620KD
— Rishika Sadam (@RishikaSadam) July 13, 2020