రేవంత్ తో చర్చల్లో అసలు విషయంపై నోరెత్తని టాలీవుడ్ ?
హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ పెద్దలు, హీరోలు పలు అంశాల్ని ప్రస్తావించారు. అయితే ఓ కీలక అంశంపై మాత్రం నోరెత్తలేదు. ఈ విషయాన్ని చర్చల తర్వాత బయటికి వచ్చిన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజు స్వయంగా వెల్లడించారు. అయితే ఎందుకు మాట్లాడలేదనే అంశాన్ని మాత్రం ఆయన చెప్పలేదు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ప్రీమియర్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన టాలీవుడ్కు మాయని మచ్చగా మారింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంతో.. అటు ప్రభుత్వానికి, ఇటు సినీ పరిశ్రమకు మధ్య వివాదం మొదలైంది. అయితే ఇవాళ ఇండస్ట్రీలోని సమస్యలను ఆయనతో చర్చించేందుకు సినీ పెద్దలు కొందరు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాల్ని చర్చించారు. అయితే సంధ్య థియేటర్ ఘటన అంశాన్ని టాలీవుడ్ పెద్దలు ప్రస్తావించలేదు.

ఇవాళ్టి భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొన్ని ప్రతిపాదనలు చేయగా.. హాజరైన పెద్దలు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. అనంతరం ఈ సమావేశానికి కారణమైన తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు మీటింగ్ విశేషాలను వెల్లడించారు. ఇందులో ఆయన.. సీఎం రేవంత్ రెడ్డితో ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల్ని స్ధూలంగా వివరించి పరిష్కారాల కోసం ప్రయత్నించామని, సంధ్య థియేటర్ విషయంపై ప్రత్యేకంగా మాట్లాడలేదన్నారు. అయితే సీఎం రేవంత్ మాత్రం సంధ్య థియేటర్ ఘటన వీడియోను మాత్రం టాలీవుడ్ పెద్దల కోసం ప్రదర్శించారు.
వాస్తవానికి సంధ్య థియేటర్ ఘటన తర్వాతే రేవంత్ వర్సెస్ టాలీవుడ్ గా పరిస్దితి మారింది. అల్లు అర్జున్ ను ఈ కేసులో అరెస్టు దాకా వెళ్లడం, ఆ తర్వాత అసెంబ్లీలో ప్రస్తావన, తిరిగి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో నుంచి అల్లు అర్జున్ ఇంకా బయటపడలేదు. ఈ నేేపథ్యంలో సంధ్య థియేటర్ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందనే విషయం ఈ భేటీకి హాజరైన ఆయన తండ్రి అల్లు అరవింద్ చెప్తారని అంతా భావించారు. కానీ ఆయన కూడా మౌనంగానే ఉండిపోయారు. ఆ ఘటన గురించి మాట్లాడితే చర్చల వాతావరణం దెబ్బతింటుందని టాలీవుడ్ పెద్దలు భావించినట్లు అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications