పబ్లకు షాక్: రాత్రి 10 దాటాక మ్యూజిక్ బంద్ అంటూ హైకోర్టు తేల్చేసింది
హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల క్రమంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోని పబ్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మరోసారి పబ్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. పబ్ల వ్యవహారంపై హైకోర్టు విచారణ చేపట్టింది.

రాత్రి 10 తర్వాత పబ్లలో మ్యూజిక్ బంద్: హైకోర్టు
జూబ్లీహిల్స్లో ఉన్న పబ్లు రాత్రి 10 తర్వాత మ్యూజిక్ పెట్టరాదని హైకోర్టు ఆదేశించింది. పది పబ్ లలో న్యూ ఇయర్ ఈవెంట్స్లోనూ 10 తర్వాత సౌండ్ పెట్టరాదని పేర్కొంది. గతంలో ఇచ్చిన ఆర్డర్నే న్యాయస్థానం సమర్థించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు సవరించాలన్న పబ్ నిర్వాహకుల అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. గతంలో విధించిన ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది.

హైదరాబాద్లో న్యూ ఇయర్ ట్రాఫిక్ ఆంక్షలు
మరోవైపు, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 2 గంటల వరకు ఆ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షల సమయంలో ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్బండ్ మీదుగా వాహనాలను అనుమతించరు. ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను నిరంకారి భవన్, రాజ్ భవన్ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు. లిబర్టీ కూడలి, అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద దారి మళ్లిస్తారు. మింట్ కాంపౌండ్ రోడ్డును మూసివేయనున్నారు.

డంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్ చేస్తే చర్యలు
నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి మీదుగా సంజీవయ్య పార్క్ వైపు వెళ్లే వాహనాలకు రాణిగంజ్ మీదుగా మళ్లిస్తారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కవాడిగూడ కూడలి, లోయర్ ట్యాంక్బండ్ కట్టమైసమ్మ గుడి మీదుగా మళ్లించనున్నారు. ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలపై డిసెంబర్ 31 రాత్రి పోలీసులు ప్రత్యక డ్రైవ్ చేపట్టనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతోపాటు వేగంగా, రాష్ డ్రావింగ్ చేసేవారిపై చర్యలు తీసుకోనున్నారు. పోలీసుల సూచనలకు అందరూ సహకరించాలని సీపీ కోరారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ఆంక్షలు విధిస్తున్నారు. దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జితోపాటు ఫ్లైఓవర్లపైకి వాహనాలను అనుమతించరు.

న్యూఇయర్ వేళ హైదరాబాద్, సైబరాబాద్ ఫ్లై ఓవర్ల బంద్
ఔటర్ రింగ్ రోడ్డుపై డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు విమానాశ్రయానికి వెళ్లే వాహనాలు తప్ప ఇతర వాహనాలకు అనుమతి ఉండదు. పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్వే ఫ్లైఓవర్పైనా ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. గచ్చిబౌలి శిల్పాలేవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ పార్కు ఫ్లైఓవర్ లెవల్ 1,2, షేక్పేట ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరంమాల్ ఫ్లైఓవర్, జేఎన్టీయూ ఫ్లైఓవర్, కైత్లాపూర్ ఫ్లైఓవర్, బాలానగర్ బాబూ జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్లపైకి ఈ సమయంలో వాహనాలను అనుమతించరు. ప్రయాణాలను నిరాకరించే డ్రైవర్లపై వాహన నెంబర్, సమయం వివరాలతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు 9490617346 నెంబర్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. క్యాబ్స్, ట్యాక్సీలు, ఆటో డ్రైవర్లు ప్రజలను ప్రయాణాలకు నిరాకరించకూడదని ట్రాపిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.












Click it and Unblock the Notifications