ఇప్పుడు కుట్రనా: కిషన్, రాజకీయాలు తప్ప..
హైదరాబాద్: జనం ఓట్లు వేయడంతో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరా ఓట్లు వేశాక వారికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం ఏమిటని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శనివారం ప్రశ్నించారు. బిజెపి కిసాన్ మోర్చా పదాధికారుల సమావేశం బీజేపీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఎన్నికల ముందు తెరాస రైతులు అందరికీ రుణమాఫీ అంటూ తమ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన కారణంగానే తెలంగాణ యావత్తు రైతాంగం మూకుమ్మడిగా తెరాసకు ఓట్లు వేశారన్నారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ విషయంలో అనేక అంశాలతో ముడిపెడుతూ రైతుల ఆశలను అడియాస చేసే దిశగా అనేక కుట్రలు చేస్తున్నారన్నారు. బావుల తవ్వకాలకు తీసుకున్న రుణం వ్యవసాయానికి తీసుకున్నది కాదా అని ప్రశ్నించారు.
అలాగే కరెంట్ మోటార్లకు తీసుకున్న రుణం వ్యవసాయానికి తీసుకున్నది కాదా అని నిలదీశారు. బ్యాంకులో రుణం తీసుకున్న ప్రతి రైతుకు లక్ష రూపాయిల వరకూ మాఫీ చేయాల్సి ఉండగా, షరతులు విధించినపుడు ఇంకేం మాఫీ జరుగుతుందన్నారు. అసెంబ్లీని తక్షణం సమావేశపరచాలని శాసనసభాపక్షం నేత డాక్టర్ కేల లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశపరచడానికి ఎందుకు వెనుకాడుతోందో అర్ధం కావడం లేదన్నారు. 14వ ఆర్ధిక సంఘం చైర్మన్ను కలిసి వివిధ పద్దుల కింద తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధులపై వినతి పత్రం అందజేసినట్టు లక్ష్మణ్ చెప్పారు. కేసీఆర్ వంద రోజుల్లో ఒక్క పని చేయలేదన్నారు. మంత్రులకు ఏం తెలియదని స్వయంగా చెప్పడమే దీనికి నిదర్శనమన్నారు. రాజకీయాలు తప్ప పాలన పట్టదా అన్నారు.