పొత్తులపై నోరు జారొద్దు,బాబు ఇంటి వద్ద తలసాని, ఏం జరుగుతోంది?
హైదరాబాద్: తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుచంద్రబాబునాయుడు పార్టీని నేతలకు సూచించారు.పొత్తులపై ఎవరికి తోచినట్టు వారు ప్రకటనలు చేయకూడదని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారని సమాచారం.
తెలంగాణ టిడిపి నేతలతో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హైద్రాబాద్లోని తన నివాసంలో ఆదివారం నాడు సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో పొత్తులపై పార్టీలో నేతల మధ్య ప్రకటనల యుద్దం సాగుతున్న తరుణంలో పార్టీకి చెందిన ముఖ్య నేతలు బాబుతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
గందరగోళం: టిఆర్ఎస్తో పొత్తుపై చంద్రబాబు ఇలా..రేవంత్ దారెటు?
సుదీర్ఘకాలం తర్వాత ఏపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహించిన పార్టీ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకుడు దేవేందర్గౌడ్ కూడ హజరయ్యారు. అనారోగ్య కారణాలతో అమెరికాకు వెళ్ళి చికిత్స చేసుకొని ఇటీవలే దేవేందర్గౌడ్ ఇండియాకు తిరిగి వచ్చారు.
అయితే అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత పార్టీ సమావేశాల్లో పాల్గొనడం బహుశా ఇదే ప్రథమం. దేవేందర్ గౌడ్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటే ఇబ్బందులు తప్పుతాయనే అభిప్రాయంతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఉన్నారు.
పొత్తులపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడకూదని బాబు వార్నింగ్
టీటీడీపీ నేతల వ్యవహారశైలిపై పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడం, కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపడం మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయమై ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడవద్దని పార్టీ నాయకులను చంద్రబాబునాయుడు హెచ్చరించినట్టు సమాచారం.
పార్టీ క్యాడర్లో ఆత్మ విశ్వాసం నింపాలి
తనపై ఆధారపడకుండా సొంతంగా తెలంగాణలో బలపడాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్టు సమాచారం.పార్టీ క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రయత్నాలు చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారని సమాచారం.
తెలంగాణలో పర్యటిస్తాను
పార్టీ కోసం తాను త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పూర్వ వైభవాన్ని సంపాదించడమే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు చర్చించారు.టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
బాబు ఇంటి వద్ద తలసాని కాన్వాయ్
టిడిపి చీఫ్ చంద్రబాబు తెలంగాణ నేతలతో సమావేశమౌతున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాన్వాయ్ చంద్రబాబు నివాసం మీదుగా వెళ్ళింది.. దీంతో, అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు తలసానితో మాట్లాడారు.ట్రాఫిక్ జామ్ కారణంగా రోడ్ నెం.36 వైపు వెళ్లే నిమిత్తం ఇటువైపు రావాల్సి వచ్చిందని చెప్పారు తలసాని శ్రీనివాస్ యాదవ్. చంద్రబాబు హైద్రాబాద్లో ఉన్న విషయం తనకు తెలియక వచ్చానని చెప్పుకొచ్చారు.