ఆత్మహత్యలతో ఆందోళన: ఎంపి కవిత, ‘రైతు దత్తత’కు భారీగా విరాళాలు
వరంగల్: ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ జాగృతి చేపట్టిన రైతు దత్తత కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం హాఫ్ డే జీతాన్ని విరాళంగా ప్రకటించింది. మరో 12 మంది 7.10 లక్షల రూపాయల విరాళాలను చెక్కుల రూపంలో అందజేశారు.
హన్మకొండలో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం సర్వసభ్య సమావేశానికి నిజామాబాద్ ఎంపి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతన్నల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
ఇటీవలే జాగృతి రైతు విభాగాన్ని కూడా ప్రారంభించిందని తెలిపారు. బాధిత కుటుంంబాలకు జాగృతి కార్యకర్తలు అన్ని విధాల అండగా ఉంటారన్నారు. బాధిత కుటుంబాలను దత్తత తీసుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారని వివరించారు.
భైరి వెంకట్రాజం రూ. 1.20 లక్షలు, పి.శరత్ చంద్ర-1లక్ష రూపాయలు, రాంపల్లి రఘు- రూ. 1లక్ష, జలగం మోహన్ రావు- రూ. 60 వేలు, బొంపెల్లి సోమేశ్వర రావు కుటుంబీకులు-రూ. 60 వేలు, శ్రీసాయివాణి జూనియర్ కాలేజీ- రూ.50 వేలు, కె. అనిత - రూ. 50 వేలు, మాస్టార్జీ ఎడ్యుకేషనల్ సొసైటీ-రూ. 50 వేలు, పొరెడ్డి వెంకట రామిరెడ్డి- రూ. 50 వేలు, ఎఐటియుసి ఆర్టీసి అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్ వరంగల్ శాఖ 25 వేలు, భవిత హెల్త్కేర్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ-25 వేలు, ఎ. ముకుందరావు-20 వేల రూపాయల చెక్కును ఎంపి కవితకు అందజేశారు.
వరంగల్కు చెందిన ఇద్దరు చిన్నారులు అభిశై జాన్సన్, రితికలు తమ కిట్టీ బ్యాంకులను కూడా రైతు సంక్షేమ నిధి కోసం కవితకు అందించారు. చిన్నారులైనా పెద్ద మనసుతో ముందుకు వచ్చిన వారిని కవిత అభినందించారు. వీరితో పాటు కుమారి లహరి కూడా తన కిట్టీ బ్యాంక్ ను రైతు సహాయ నిధికి అందించారు.
కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికుల సర్వీసును రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కల్వకుంట్ల కవిత చెప్పారు. త్వరలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 1175 మంది సర్వీసు రెగ్యులర్ అవుతుందన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా.. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేసేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇంకా ఉద్యోగుల విభజన జరగక పోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోందని కవిత వివరించారు. బంగారు తెలంగాణ కోసం విద్యుత్ కార్మికులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని కోరారు.