కట్నం వేధింపు, బెజవాడ యువతి సూసైడ్: కాల్ మనీ నష్టం వల్లేనా?
హైదరాబాద్: భాగ్యనగరంలో మరో అమ్మాయి అదనపు కట్నం వేధింపులకు బలయ్యారు! బెజవాడకు చెందిన లక్ష్మీ (రామలక్ష్మి) బేగంపేటలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బెజవాడకు చెందిన లక్ష్మీకి గుంటూరుకు చెందిన విదేష్తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అతని పేరు యోగేష్గా కూడా చెబుతున్నారు.
భర్తది గుంటూరు. లక్ష్మీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆమె భర్త సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఉద్యోగరీత్యా వారు హైదరాబాదులో ఉంటున్నారు. తనకు ప్రమోషన్ వచ్చిందని చెప్పి అతను మరో రూ.20 లక్షలు అదనపు కట్నంగా డిమాండ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. లక్ష్మీ గర్భిణీ కూడా.
లక్ష్మీకి భర్తతో గతంలోను గొడవలు అయ్యాయని, ఆ తర్వాత మళ్లీ భర్త వద్దకు వచ్చిందని చెబుతున్నారు. లక్ష్మీ రెండు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, భర్త కుటుంబం గుంటూరులో కాల్ మనీ చేస్తున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. కాల్ మనీ వ్యాపారంలో నష్టం రావడంతో భార్యను అదనపు కట్నం కోసం డిమాండ్ చేసినట్లుగా చెబుతున్నారు. పోలీసులు విచారిస్తున్నారు.
కంటతడి పెట్టిన సోదరుడు
తన సోదరి లక్ష్మి బెజవాడ లయోలా కాలేజీలో టాపర్ అని, అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని సోదరుడు చెప్పారు. ఎలాంటి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పిన యోగేష్, ఆ తర్వాత పెళ్లి సమయంలో ఖర్చుల కోసమని మూడు లక్షలు తీసుకున్నారని ఆరోపించారు.
ఇప్పుడేమో తనకు ప్రమోషన్ వచ్చిందని చెప్పి మరింత డబ్బు అడిగాడని కంటతడి పెట్టారు. తనకు పెళ్లైనప్పుడు కూడా ఆడపిల్ల కట్నం కింద కూడా కొంత మొత్తం ఇచ్చానని చెప్పారు.
తన సోదరి భర్తకు ఇండివిడ్యుయాలిటీ లేదని, అతనిని కఠినంగా శిక్షించాలన్నారు. తన సోదరిని చాలా బాధపెట్టారని, దీనికంతటికీ కారణం అతని అమ్మానాన్న, అక్కాబావ అని ఆరోపించారు. తనకు మీడియా సపోర్ట్ కావాలన్నారు.
వరకట్న వేధింపులకు అవకాశమే లేదు: లక్ష్మీ భర్త
తన భార్యను ఎప్పుడు కూడా కట్నం లేదా అదనపు కట్నం కోసం వేధించలేదని భర్త చెబుతున్నారు. ఆమెను పూవులా చూసుకున్నానని చెప్పారు. విచారణలో నేను తప్పు చేశానని తేలితే చర్యలు తీసుకోవచ్చన్నారు. తన భార్య కుటుంబం పరిస్థితి తెలుసునని, అందుకే వారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదన్నారు.
తమ మధ్య ఆత్మహత్య చేసుకునేంత గొడవ ఎప్పుడూ జరగలేదన్నారు. చిన్నా, చితక గొడవలు సహజమేనని చెప్పారు. గతంలో ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్తలపై స్పందిస్తూ... అదే నిజమైతే తన వద్దకు తిరిగి ఎలా వస్తుందన్నారు. తమకు తమ ఊళ్లో ఎలాంటి వడ్డీ వ్యాపారం లేదన్నారు.