కొండా సురేఖ వ్యవహారంలో అనూహ్య పరిణామం.. !!
తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఇటీవలే ఆమెకు వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు గళం విప్పారు. మంత్రివర్గం నుంచి బహిష్కరించాలంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. కొందరు మంత్రులు, సీనియర్ నేతలు.. ఆమె పట్ల అంటీముట్టనట్టుగా ఉంటోన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలపై అటు కొండా సురేఖ కూడా స్పందించారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణా కమిటీకి వివరణ ఇచ్చినప్పటికీ.. కొందరు నేతలు బహిరంగంగా అవమానకర రీతిలో మాట్లాడుతున్నారని, వారి వెనుక ఉన్న అదృశ్య వ్యక్తులెవరో గుర్తించి, వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవికి లేఖ రాశారు. పార్టీ నాయకత్వం, క్రమశిక్షణా నియమావళిపై తనకు గౌరవం ఉందని, నోటీసును ఉపసంహరించుకోవాలని కూడా కోరారు.

వీటినేవీ కూడా టీపీసీసీ పరిగణనలోకి తీసుకోవట్లేదు. దీనికి తాజా ఉదాహరణ.. కొండా సురేఖ భర్త కొండా మురళీకి పార్టీ సీనియర్ నాయకులు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత చోటు చేసుకుంటోన్న పరిణామాలపై పార్టీ సీనియర్ నాయకులను వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇవ్వాలని కొండా మురళి రెండు రోజులుగా ప్రయత్నిస్తోన్నారు. దీనిపై ఎవ్వరూ సానుకూలంగా స్పందించట్లేదని తెలుస్తోంది.
తాజాగా ఆయన పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అపాయింట్మెంట్ కోరగా.. అందుకు ఆయన నిరాకరించారని సమాచారం. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవ పరిస్థితులను వివరించి, తన వైఖరిని స్పష్టం చేయడానికి కొండా మురళి డిప్యూటీ సీఎంను కలవాలని భావించారు. ఆయనకు అపాయింట్మెంట్ నిరాకరించడంతో దాదాపుగా కొండా సురేఖ విషయంలో పార్టీ ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
ప్రభుత్వం, పార్టీలోనూ అత్యంత కీలక స్థానంలో ఉన్న భట్టి విక్రమార్క అపాయింట్మెంట్ ఇవ్వకపోెవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీలో క్రమశిక్షణను కాపాడేందుకే అధిష్ఠానం పెద్దలు ఈ వ్యూహాత్మక దూరాన్ని పాటిస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ పరిణామం కొండా అనుచరులతో పాటు వరంగల్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులలో చర్చనీయాంశమైంది.
మరోవంక.. కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పని చేసిన సుమంత్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్లో సుమంత్ ఇంటి వద్దే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి, ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశాడని సుమంత్పై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కొండా సురేఖ ఆదేశాల మేరకు 2023 డిసెంబర్ 17వ తేదీన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా జాయిన్ అయ్యారు సుమంత్. 2024 డిసెంబర్ 16వ తేదీ నాటికి ఆయన కాంట్రాక్ట్ గడువు ముగిసింది. అయినప్పటికీ- దీన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. 2025 డిసెంబర్ 16 వరకు ఆయన విధుల్లో కొనసాగాల్సి ఉన్నప్పటికీ.. అదే ఏడాది అక్టోబర్ 17వ తేదీన ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది.














Click it and Unblock the Notifications