సోనియాకు డిఎస్ లేఖ: తనను కలవలేదన్న కెకె
హైదరాబాద్: తాను తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో తాను చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ స్పందించారు. టీఆర్ఎస్లో చేరికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్పై అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు.
తన పదవీకాలం ముగిసి నెలరోజులైనా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిగ్విజయ్ సింగ్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, తనని ఢిల్లీ రమ్మని కూడా ఎవరూ పిలవలేదని, కనీసం సోనియా కూడా పలకరించలేదని వాపోయారు.
కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ తనను కలిశాడని వస్తున్న వార్తలను టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఖండించారు. డీఎస్ తన ఇంటికి వచ్చి కలిశాడనే వార్తల్లో నిజంలేదన్నారు. ఈ వార్తలను ఖండిస్తున్నానని తెలిపారు.
కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ అధిష్ఠానం సీటు ఇవ్వకపోవడంపై డీఎస్ అసంతృప్తితో ఉన్నారు. ఈమేరకు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అధినేత్రి సోనియాకు మంగళవారం లేఖ కూడా రాశారు. మరో మూడు రోజుల్లో డీఎస్ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.
రెండో విడత ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వకపోవడంతో డిఎస్ తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే డీఎస్ టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిసింది. త్వరలోనే కేసీఆర్ సమక్షంలో డీఎస్ టీఆర్ఎస్లో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తమ పార్టీలో చేరేందుకు డీఎస్కు పలు ఆఫర్లను కూడా టీఆర్ఎస్ ప్రకటించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవిని ఆయనకు కట్టబెట్టే యోచనలో టీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.